ఇనమడుగు వాసి ఎద్దుల సాయికుమార్‌రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు

21 Apr, 2022 08:21 IST|Sakshi
అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్‌ సాయికుమార్‌రెడ్డి   

కోవూరు (నెల్లూరు): మండలంలోని ఇనమడుగు వైఎస్సార్‌సీపీ నాయకుడు పొన్నవోలు సుధీర్‌రెడ్డి అల్లుడు ఎద్దుల సాయికుమార్‌రెడ్డికి లండన్‌ రాయల్‌ కమిషన్‌ ఫెలోషిఫ్‌ అవార్డు అందజేసింది. సాయికుమార్‌రెడ్డి 2018లో లండన్‌ ఇంపీరియల్‌ కళాశాలలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ సమయంలో ఆధునిక హైడ్రోజన్‌ వాయువుతో  ఐదు రెట్లు వేగంతో నడిచే విమాన ఇంజిన్ల అభివృద్ధి మీద పరిశోధన చేశారు. అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన పరిశోధనకు మెచ్చి 2021లో యంగ్‌ సెంటిస్ట్‌ అవార్డును ప్రకటించారు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ఆయన రాసిన ఆర్టికల్‌ను జనరల్‌ ఆఫ్‌ ప్లూయిడ్స్‌ మెకానిక్స్‌లో ప్రచురించారు. అదే ఏడాది ఇంగ్లాడ్‌ దేశ రాయల్‌ కుటుంబంచే నడపబడే రాయల్‌ కమిషన్‌ ఆయన ప్రతిభను గుర్తించి ప్రతిష్టాత్మకమైన రాయల్‌ ఫెలోషిఫ్‌ అవార్డును అందజేశారు. ఇటీవల బ్రిటన్‌æ రాణి ఎలిజిబెత్‌ కుమార్తె రాయల్‌ ప్రిన్సెస్‌ అన్నే డాక్టర్‌ ఎద్దుల సాయికుమార్‌రెడ్డిని కొద్దిరోజుల క్రితం ప్రెసిడెన్సియల్‌ విందుకు ఆహ్వానించి రాయల్‌ ఫెలోషిప్‌ అవార్డును అందించి ఘనంగా సత్కరించారు.

అవార్డు దక్కించకునేందుకు తనకెంతో సహకరించిన తల్లిదండ్రులు, అత్తమామలు కుటుంబ సభ్యులు, స్నేహితులకు సాయికుమార్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. తనను ప్రోత్సహించిన అన్న స్వర్గీయ సాయిసందీప్‌రెడ్డికి డాక్టరేట్‌ను అంకితం ఇస్తున్నానని తెలిపారు.

చదవండి: (వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కలిసిన మంత్రులు కాకాణి, అమర్‌నాథ్‌)

మరిన్ని వార్తలు