ఆంధ్ర- కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం

19 Sep, 2020 09:05 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున  ఘెర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చంద్రబావి వద్ద  వేగంగా వచ్చిన లారీ ఇన్నోవాను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్ణాటక మధుగిరి ఆసుపత్రికి తరలించారు. కాగా బెంగళూరు నుంచి పావగడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది.


కృష్ణా : జిల్లాలోని నందిగామ మండలం మునగచర్ల గ్రామం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వస్తున్న ఎస్‌వీకేడీటీ ట్రావెల్స్‌ బస్సు మునగచర్ల సమీపంలోకి రాగానే వేగంగా వస్తున్న లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ, బస్సు రెండు బోల్తా పడ్డాయి. కాగా ప్రమాదంలో బస్పులో ఉన్న 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కపోయిన డ్రైవర్‌, క్లీనర్‌లను స్థానికులు సురక్షితంగా బయటికి తీశారు.

చిత్తూరు : జిల్లాలోని ఏర్పేడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏర్పేడు వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలు కాగా.. బస్సు డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్‌ తప్ప ఎవరు లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా గాయపడ్డ ఇద్దరు డ్రైవర్లను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు