మొదట కాదన్నారు.. తర్వాత కాళ్లు కడిగారు

19 Aug, 2020 18:47 IST|Sakshi

సాక్షి, అనంతపురం : కూతురి ప్రేమను హర్షించని ఆ పెద్దలు ప్రేమ పెళ్లికి ససేమీరా అన్నారు. ఓసారి అబ్బాయిని రౌండ్‌ చేసి చావ చితక్కొట్టారు. ఇక అంతా అయిపోయింది, ఆ ప్రేమ పక్షులు విడిపోవాల్సిందే అనుకున్న జనాలకు షాక్‌ ఇస్తూ అమ్మాయి తరపు వారు కూతురి ప్రేమ పెళ్లికి పచ్చ జెండా ఊపేశారు. మొదట కాదన్న వాళ్లే మంచంపై కూర్చున్న అబ్బాయి కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. ఈ వింత సంఘటన అనంతపురం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. పామిడి మండ‌లం పీ కొండాపురం గ్రామానికి చెందిన జ‌గ‌దీష్‌ ఇంటి ఎదురుగా ఉండే శ్రీ‌ల‌క్ష్మిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామ‌ని అనుకున్నాడు. కానీ, అమ్మాయి త‌ర‌పువారు ఇందుకు ఒప్పుకోలేదు. అంతే కాదు, మరో పెళ్లికి ఏర్పాట్లు చూశారు. కానీ అమ్మాయిని అమితంగా ఇష్టప‌డిన‌ జ‌గ‌దీష్‌ ఆ పెళ్లి జ‌ర‌క్కుండా అడ్డుప‌డ్డాడు. దీంతో శ్రీలక్ష్మి త‌ర‌పు వారికి కోపం వ‌చ్చింది. ( మనోజ్‌ 'ఖజానా' చూస్తే కళ్లు తిరగాల్సిందే.. )

ఒక దుర్ముహూర్తం చూసుకుని జ‌గ‌దీష్‌పై దాడి చేశారు. దాడిలో గాయ‌ప‌డిన జ‌గ‌దీష్ ఆసుప‌త్రిపాల‌య్యాడు. వ్యవ‌హారం పోలీసు కేసు దాకా వెళ్లింది. దీంతో పెద్ద మ‌నుషులు జోక్యం చేసుకున్నారు. వాళ్లిద్దరూ ఇష్టప‌డ్డారు.. పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారని న‌చ్చజెప్పారు. దీంతో రెండు కుటుంబాలు శాంతించి పెళ్లికి ఒప్పుకున్నాయి. గాయాలపాలైన జగదీష్‌ లేవలేని పరిస్థితిలో ఉన్నందుకు మంచం మీదే పెళ్లి తంతు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు