బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం
కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు రాజస్థాన్, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ రాగల రెండు రోజుల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఉత్తర బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ లో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 25 నుండి క్రమేణా వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.