సమర్థంగా రసాయన ప్రమాదాల నియంత్రణ

24 Feb, 2023 05:07 IST|Sakshi

ఎన్‌డీఎంఏ ప్రతినిధి తకర్, ఎస్‌డీఎంఏ ఎండీ అంబేద్కర్‌  

రాష్ట్రంలోని 17 జిల్లాల్లోని పరిశ్రమల్లో మాక్‌డ్రిల్‌

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: భారీపరిశ్రమల్లో సంభవించే రసాయన ప్రమాదాలను సైతం సమర్థంగా నివారించే శక్తిసామర్థ్యాలు మనకున్నాయని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ప్రతినిధి బ్రిగేడ్‌ బి.ఎస్‌.తకర్‌ చెప్పారు. అగ్ని ప్రమాదాలతో పాటు ఫ్యాక్టరీల్లో సంభవించే ఇతర ప్రమాదాల నివారణపైనా దృష్టిపెట్టినట్టు తెలిపారు. ఎన్‌డీఎంఏ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఎస్‌డీఎంఏ) సహకారంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఆఫ్‌సైట్, ఆన్‌సైట్‌ ఫ్యాక్టరీల్లో కెమికల్‌ ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్‌ నిర్వహించారు.

విశాఖపట్నంలోని ఈస్ట్‌ ఇండియా హెచ్‌పీసీఎల్‌ వద్ద నిర్వహించిన మాక్‌డ్రిల్‌ను బ్రిగేడ్‌ బి.ఎస్‌.తకర్, ఎస్‌డీఎంఏ ఎండీ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ డి.ఎస్‌.సి.వర్మ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తకర్‌ మాట్లాడుతూ ఇలాంటి మాక్‌డ్రిల్స్‌తో పరిశ్రమల్లో రసాయన ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యం, ఆయా జిల్లాల యంత్రాంగం స్పందించి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెరుగుతుందని చెప్పారు.

డాక్టర్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ సహజ, మానవ తప్పిదాలతో జరిగే విపత్తులతోపాటు కెమికల్‌ డిజాస్టర్స్‌పైనా దృష్టి సారించినట్లు తెలిపారు. అవగాహన, ముందుజాగ్రత్త చర్యలతో పాటు ప్రణాళిక రూపొందించడం ద్వారా రసాయనిక ప్రమాదాల స్థాయిని తగ్గించవచ్చన్నారు. భవిష్యత్‌లో వరదలు, తుపాన్లపైనా మాక్‌డ్రిల్స్‌తో అవగాహన కలి్పస్తామని చెప్పారు. 17 జిల్లాల్లో నిర్వహించిన మాక్‌డ్రిల్స్‌లో.. ఫ్యాక్టరీల్లో రసాయనిక ప్రమాదాలు జరిగితే ఎలా ప్రతి స్పందించి చర్యలు తీసుకుంటారో ఫైర్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రత్యక్షంగా చూపించాయి.

   

మరిన్ని వార్తలు