పది రోజులుగా అన్నం తినకుండా పూజలు

26 Jan, 2021 18:18 IST|Sakshi

బిడ్డలను కడతేర్చిన తల్లిదండ్రులకు 14 రోజుల రిమాండ్‌

సాక్షి, చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులుగా చేర్చిన తల్లిదండ్రులిద్దరినీ పోలీసులు మంగళవారం రెండవ అదనపు ఫస్టు క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు వద్ద హాజరు పర్చారు. మెజిస్ట్రేట్ నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా వారిని సబ్‌ జైలుకు తరలించారు. కాగా ఈనెల 24వ తేదీన పురుషోత్తం నాయుడు, ఆయన భార్య పద్మజ క్షుద్రపూజల పేరుతో తమ కన్న బిడ్డలు అలేఖ్య(27), సాయిదివ్య(21)ను ఇంట్లో అత్యంత కిరాతకంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో పిల్లలిద్దరినీ తామే చంపినట్లు నిందితులు నేడు పోలీసులు ఎదుట నేరం అంగీకరించారు. (చదవండి: మదనపల్లి అక్కాచెల్లెళ్ల హత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌)

మా బిడ్డలు తెలివైనవాళ్లు..
అయితే బిడ్డలు తిరిగి బతికి వస్తారన్న ఆశతోనే ఇలా చేశామని మృతురాలి తల్లి పద్మజ వెల్లడించింది. "మా ఇంట్లో దేవుళ్ళున్నారు. పూజలు చేస్తున్నాం. పూజల వల్లే మా చిన్న కుమార్తె ఆరోగ్యం బాగు పడింది. పది రోజులుగా అన్నం తినకుండా పూజలు చేస్తున్నాం. మా బిడ్డలు చాలా తెలివైనవాళ్లు. ప్రపంచంలో ఘోరాలు పెరిగిపోయాయి, అవి తగ్గటానికి పూజలు చేస్తున్నాం. ఇక కలియుగం అంతం అయిపోయింది, సత్య యుగం వచ్చింది" అని చెప్పుకొచ్చింది. మరోవైపు నిందితుల మానసిక స్థితిపై పోలీసులు, వైద్యులు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారు. నిందితులను ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షించిన సైక్రియాట్రిస్ట్ రాధిక వారి మానసిక స్థితి సరిగా లేదంటూనే, వారి ఆరోగ్య స్థితి మెరుగు పడాలంటే తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్యం ఇప్పించాలన్నారు. అటు డీఎస్పీ రవిమనోహరా చారి మాత్రం నిందితుల మానసిక స్థితి బాగానే వుందని పేర్కొన్నారు. తాము అడిగిన దానికి స్పష్టంగా సమాధానం ఇచ్చారని, అయితే ఆధ్యాత్మికత చాలా ఎక్కువగా వుందని తెలిపారు. (చదవండి: చిత్తూరు జిల్లాలో దారుణం..)

చదవండి: స్వర్గాన్ని నాశనం చేసేశారు !: పోలీసులు, సన్నిహితులతో తల్లి వాగ్వాదం
చదవండి: మదనపల్లి జంటహత్యల కేసులో కొత్త ట్విస్ట్

మరిన్ని వార్తలు