స్నేహితులే చంపేశారా..?

19 Sep, 2020 10:55 IST|Sakshi
బర్త్ డే పార్టీ లో పవన్ సాయి చనిపోకముందు దిగిన ఫోటో

స్విమ్మింగ్‌పూల్‌లో పడి యువకుడు మృతి

విశాఖపట్నం : జిల్లాలో ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బర్త్‌ డే పార్టీలో పాల్గొన్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడి మృతదేహం స్విమ్మింగ్‌ పూల్‌లో కనిపించడంతో స్నేహితులే చంపేశారు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక చెందిన సుధాకర్ అనే యువకుడు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం అచ్యుతాపురం మండలం కొండకర్ల వద్ద ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బర్త్‌ డే పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సుధాకర్‌కు చెందిన మొత్తం 10 మంది స్నేహితులు ఈ పార్టీలో పాల్గొన్నారు.

వీరిలో గాజువాక బీసీ కాలనీకి చెందిన సాయి అనే యువకుడు స్విమ్మింగ్ పూల్‌ పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పార్టీ అనంతరం స్మిమ్మింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తోటి స్నేహితులు చంపేసి ఉంటారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదోతరగతి చదువుతున్న ఈ సాయి తల్లిదండ్రులు మరణించడంతో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు