కుక్కను రక్షించబోయి.. ఎస్సార్బీసీలో పడి యువకుడు గల్లంతు 

12 Jan, 2022 13:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అవుకు: శ్రీశైలం రైట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ (ఎస్సార్బీసీ)లో పడిన పెంపుడు కుక్కను రక్షించబోయి ఓ యువకుడు  నీళ్లలో కొట్టుకోపోయాడు. రామవరం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.  గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. రామవరం గ్రామానికి చెందిన నాగరాజు, నారాయణమ్మ కుమారుడు మాసుబాకల నరేష్‌ (18).. ఇంటర్‌ పూర్తి చేశాడు. ఇంటి వద్ద  ఖాళీగా ఉండటంతో మంగళవారం గేదెలను మేపటానికి వెళ్లాడు. వెంట ఉన్న   కుక్క గ్రామ శివారులోని ఎస్సార్బీసీలో  పడిపోయింది.  దానిని రక్షించటానికి వెళ్లిన ఆయువకుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు.

అటుగా వెళ్తున్న  ఓ బాలుడు గుర్తించి  గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు  క్రేన్‌ సహాయంతో ఈతగాళ్లను కాలువలోకి దించి రాత్రి వరకు గాలించారు. అయినా, యువకుడి ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలువలో కొట్టుకుపోయి ఉంటాడని స్థానికలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు నీటిలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.   

మరిన్ని వార్తలు