లక్కీడిప్‌ పేరుతో మోసం

5 Jan, 2021 08:51 IST|Sakshi

కారు తగిలిందంటూ మెసేజ్‌

పన్ను, ఆర్బీఐ చార్జ్‌ పేరుతో డబ్బు డిమాండ్‌

రూ.47,880 ఫోన్‌ పే చేసి మోసపోయిన బాధితుడు

సాక్షి, ఎమ్మిగనూరు రూరల్‌: లక్కీడిప్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్ల మోసానికి పట్టణానికి చెందిన ఓ యువకుడు బలయ్యాడు. ఒకే రోజు రూ.47,580లు ఫోన్‌ పే ద్వారా డబ్బు పంపి మోసపోయాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన ఎం శ్రీనివాసులు షాపుల్లో చిన్న చిన్న పనులు చేసి జీవనం సాగించేవాడు. గత నెలలో షాప్‌ క్లూస్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా టీషర్ట్‌ కొనుగోలు చేశాడు. ఈ నెల 2న టీషర్ట్‌ తీసుకున్నందుకు మహింద్రా కంపెనీ కారు లక్కీ డ్రాలో గెలుపొందారంటూ మేసేజ్‌ వచ్చింది. పూర్తి వివరాల కోసం 7890946443 నంబరుకు ఫోన్‌ చేయాలని ఉంది. వెంటనే ఫోన్‌ చేయగా ఫోన్‌తో పాటు కారు గెలుపొందారని, కారు వద్దనుకుంటే రూ.14,43,000 బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేస్తామని అవతలి వ్యక్తి నమ్మబలికాడు. 

అందుకు ట్యాక్స్‌ కింద రూ.14,430, ఆర్బీఐ చార్జీల కింద రూ.23,150, సేవింగ్‌ అకౌంట్‌ నుంచి కరెంట్‌ అకౌంట్‌కు మార్పు చేయడానికి రూ.10 వేలు పంపాలని చెప్పటంతో అలాగే పంపాడు. అదే రోజు సాయంత్రం 5.36 గంటలకు మరోసారి ఫోన్‌ చేసి ఎన్‌ఈఎఫ్‌టీ చార్జీ కింద రూ.24,600 పంపాలని చెప్పడంతో అనుమానం వచ్చింది. ఇప్పటికే రూ. 47,580లు పంపానని ఇంకా డబ్బు కావాలనడంలో మతలబు ఏమిటని ప్రశ్నించాడు. అయినా తాము అడిగిన డబ్బు పంపితేనే మొత్తం డబ్బు జమ చేస్తామని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించి లబోదిబోమంటున్నాడు. (చదవండి: లోన్‌ యాప్‌.. కటకటాల్లోకి చైనీయులు)

మరిన్ని వార్తలు