Man Suicide In Vijayawada: సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి బలవన్మరణం 

1 Jun, 2022 04:23 IST|Sakshi
సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్న శ్రీకాంత్‌రెడ్డి

వ్యభిచార రొంపిలోకి దించి ఓ ముఠా వేధిస్తోందని ఆవేదన 

గుణదల (విజయవాడ తూర్పు): మసాజ్‌ పేరుతో వ్యభిచార రొంపిలోకి దింపి, అసభ్యకరంగా ఉన్న ఫొటోలను బయట పెడతామంటూ వేధింపులకు గురి చేస్తున్న ముఠా కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలోని ఓ హోటల్‌లో మంగళవారం జరిగింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన బెరవలి శ్రీకాంత్‌రెడ్డి (30) ప్రైవేటు ఉద్యోగి.

రెండేళ్ల క్రితం శ్రీలత అనే యువతితో అతడికి వివాహమైంది. శ్రీకాంత్‌రెడ్డి ఉద్యోగ విధుల్లో భాగంగా కొంతకాలంగా విజయవాడ వచ్చిపోతున్నాడు. ఈ క్రమంలో చైతన్య, సత్యకుమార్, సునిల్‌ అనే ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు.  వీరు శ్రీకాంత్‌రెడ్డిని ఇటీవల ఓ మసాజ్‌ సెంటర్‌కు తీసుకెళ్లి ఓ మహిళతో చనువుగా ఉండేలా చేశారు. అదే సమయంలో సెల్‌ఫోన్‌లో వారి ఫొటోలు చిత్రీకరించిన ఆ ముగ్గురూ.. ఫొటోలు తొలగించాలంటే తమకు భారీగా నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురైన శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం బెంజి సర్కిల్‌లోని ఓ హోటల్‌లో గది తీసుకుని తన ఆవేదనంతా చెప్పుకుంటూ ఓ సెల్ఫీ వీడియో తీశాడు. అనంతరం హోటల్‌ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, నిందితులు ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

మరిన్ని వార్తలు