ఏవోబీలో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు మృతి 

27 Jul, 2020 04:40 IST|Sakshi
మృతి చెందిన మావోయిస్టును అంబులెన్సులో తరలిస్తున్న దృశ్యం

సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. విశాఖ గ్రేహౌండ్స్, ఒడిశా ఎస్‌వోజీ బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తుండగా శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో చిత్రకొండ పోలీస్‌స్టేషను పరిధి రాళ్లగెడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు.

ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలంలో 303 తుపాకీ, మూడు కిట్‌ బ్యాగులు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టు జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన దయాగా గుర్తించారు. 2016లో జరిగిన రామ్‌గుడ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన పాంగి దొసో తమ్ముడు దయా. అప్పట్లో దొసో చనిపోవడంతో ఉద్యమంలో చేరాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు