ఆర్కే భార్య శిరీష
సాక్షి, ప్రకాశం: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతి చెందిన విషయం పార్టీ ప్రకటించిన తర్వాతే నిజమని భావిస్తామని ఆయన భార్య శిరీష తెలిపారు. ఆర్కే మృతిపై ఆయన భార్య శిరీష శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్కే మృతి చెందినట్టుగా మీడియాలో వచ్చే వార్తలే చూస్తున్నామని అన్నారు. ఆయన మృతి చెందారని ఛత్తీస్గఢ్ డీజీపీ ప్రకటించారని, కానీ ఆయనకు ఎవరు సమాచారం ఇచ్చారో చెప్పలేదని తెలిపారు.
ఆర్కే 40 ఏళ్లు జీవితాన్ని ప్రజలకోసం ధారపోశారని తెలిపారు. ప్రజా ఉద్యమంలో ఆర్కే ఒక యోధుడు, నిస్వార్థ విప్లవకారుడు అని తెలిపారు. ఉద్యమంలో బిడ్డను కూడా పోగొట్టుకున్నారని, ఒకవేళ ఆర్కే మృతి నిజమైతే పార్ధీవదేహం తాము తెచ్చుకునేలా అక్కడి ప్రభుత్వం, గ్రామ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్కే భార్య శిరీష ప్రస్తుతం అలకూరపాడులో నివాసం ఉంటున్నారు.