భార్య బ్యూటీ పార్లర్‌.. కోల్‌కతాలో భర్త.. తరచూ ఫోన్‌ చేసి వేధిస్తుండటంతో..

11 Mar, 2022 14:20 IST|Sakshi

శ్రీకాకుళం (టెక్కలి రూరల్‌) : టెక్కలి మేజర్‌ పంచాయతీ ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన కిల్లారి లలిత(35) అనే వివాహిత గురువారం తన ఇంట్లో ఉరి వేసుకు ని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లలిత టెక్కలి సంతోషిమాత గుడి ఎదురుగా బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తోంది. భర్త దుర్గారావు కోల్‌కతాలో పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య తరచూ ఫోన్‌లో గొడవలు జరుగుతుండేవి. ఈ మధ్య దుర్గారావు వేధింపులు మరీ ఎక్కువయ్యాయి.

గురువారం కూడా భర్తతో గొడవపడి మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని లలిత ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుమార్తె రక్షిత స్థానికుల సహాయంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లిదండ్రులు ఒడిశాలో ఉన్నారని, వారు వచ్చాక కేసు నమోదు చేస్తామని టెక్కలి ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు తెలిపారు.  

మరిన్ని వార్తలు