ప్రేమ పెళ్లి.. ఏమైందో గాని.. ఉద్యోగానికని చెప్పి జారుకున్నాడు

7 Apr, 2022 23:48 IST|Sakshi
భర్త ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న సునంద 

మద్దిపాడు (ప్రకాశం) : ఉద్యోగం చేసే ప్రాంతంలో స్నేహంతో ప్రారంభమై ప్రేమగా మారి పెద్దలకు తెలియకుండా బయటకు వెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తనను వదిలేసి ఇంటికి వచ్చేశాడని ఓ యువతి ఆరోపిస్తోంది. తన భర్త గ్రామానికి వచ్చి నిరసన దీక్ష చేస్తోంది. బాధితురాలి కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన సునంద అనే యువతి బెంగళూరు సమీపంలోని ఓ గార్మెంట్స్‌ కంపెనీలో పని చేస్తోంది. మండలంలోని దొడ్డవరానికి చెందిన కాట్రగడ్డ అనిల్‌ అదే కంపెనీలో పని చేస్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో గత డిసెంబర్‌లో వీరు పని చేస్తున్న కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న యువతి తల్లి, ఆమె కుటుంబ సభ్యులు వారిని పట్టుకుని ఈ సంవత్సరం జనవరి 12వ తేదీన బెంగళూరులో వివాహం జరిపించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నుంచి ఇంట్లోని సామగ్రిని అనిల్‌ ఒక్కొక్కటిగా అమ్ముకుంటున్నాడు. అనిల్‌ తన దుస్తులు సర్దుకుని హైదరాబాద్‌లో ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. చేసేది లేక సునంద బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. భర్త ఎంతకూ తిరిగి రాకపోవడం, ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండటంతో అనుమానించింది. తన బంధువుల సాయంతో సునంద ఎట్టకేలకు దొడ్డవరం చేరుకుంది. కుమారుడి గురించి అత్తమామలను ప్రశ్నించింది. తమకు సంబంధం లేదని, మీరే మా వాడిని ఏదో చేసి ఉంటారని ఇబ్బందిగా మాట్లాడారు. తనను ఇంట్లోకి కూడా రానివ్వలేదని ఆ యువతి వాపోయింది. విషయం పోలీసుల వరకూ వెళ్లింది. ఎస్‌ఐ కలగజేసుకుని బాధితురాలితో మాట్లాడారు. అనిల్‌ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. సునందతో కలిసి తమ కుమారుడి ఆచూకీ కోసం తాము కూడా గాలిస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు