ఆన్‌లైన్‌ చెల్లింపులకే సై

4 May, 2021 04:31 IST|Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో భారీగా పెరిగిన ఆన్‌లైన్‌ లావాదేవీలు

లావాదేవీల్లో 58.33 శాతం, విలువలో 90.58 శాతం వృద్ధి 

నాబార్డ్‌ నివేదికలో వెల్లడి 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నేపథ్యంలో దేశంలో ఆన్‌లైన్‌ ఆరి్థక లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని నాబార్డ్‌ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. కోవిడ్‌–19 లాక్‌డౌన్, ఆ తరువాత ఆంక్షల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యధికమంది నగదు లావాదేవీలు, కార్యకలాపాలకు డిజిటల్, ఆన్‌లైన్‌లనే ఎంచుకున్నారు. 2019 డిసెంబర్‌లో జరిగిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలతో పోలిస్తే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన లావాదేవీల సంఖ్యలో 58.33 శాతం, లావాదేవీల విలువలో ఏకంగా 90.68 శాతం వృద్ధి నమోదయ్యాయి.

గతంలో పాత నోట్ల రద్దు, కొత్త నోట్ల చలామణి సమయంలో డిజిటల్‌ పేమెంట్స్, ఆన్‌లైన్‌లో ఆర్థిక కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికన్నా ఇప్పుడు కోవిడ్‌ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా డిజిటల్‌ పేమెంట్స్‌తో పాటు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని ఇటీవల నాబార్డు నివేదిక వెల్లడించింది. దేశంలో డిజిటల్‌ చెల్లింపులు నిరంతరం అభివృద్ధి చెందుతుండగా కోవిడ్‌ నేపథ్యంలో ఇప్పుడు క్యూఆర్‌ కోడ్‌లను అనుమతిస్తుండటంతో రిటైల్‌ చెల్లింపుల విభాగంలో కూడా యూపీఐ చెల్లింపులు మరింత పెరుగుతాయని నాబార్డ్‌ నివేదికలో పేర్కొంది. స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉండటంతో డిజిటల్‌ పేమెంట్స్‌ పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆన్‌లైన్‌ చెల్లింపులు విస్తరిస్తున్నాయని తెలిపింది. 

మరిన్ని వార్తలు