ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా సీట్ల కేటాయింపు

16 Nov, 2022 05:09 IST|Sakshi

809 సీట్లు రాష్ట్ర విద్యార్థులకే..

సాక్షి, అమరావతి: 2022–23 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్ల భర్తీకి తొలి దశ కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తయింది. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది. యాజమాన్య కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న 3,021 మందితో తుది మెరిట్‌ జాబితా విడుదల చేయగా ఇందులో 1,042 మందికి సీట్లు కేటాయించారు. తొలి దశలోనే బీ కేటగిరీ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఇందులో 233 సీట్లలో ఏపీతో పాటు, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పించారు. మిగిలిన 809 సీట్లలో కేవలం ఏపీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు లభించాయి.  

బీఎస్సీ నర్సింగ్‌లో నేటి నుంచి వెబ్‌ ఆప్షన్‌లు
పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి రెండో దశ వెబ్‌ కౌన్సెలింగ్‌కు బుధవారం నుంచి వెబ్‌ ఆప్షన్‌ల నమోదు ప్రారంభం కానుంది.  ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటల్లోగా వెబ్‌ ఆప్షన్‌లు నమోదు చేసుకోవాలి.  https://ugpostbasic.ntruhs admi ssions.com వెబ్‌సైట్‌లో తుది జాబితాలో పేర్లు న్న విద్యార్థులు ఆప్షన్‌లు నమోదు చేసుకోవాలి. ఇదిలా ఉండగా నంద్యాల జిల్లాలో ఓ ప్రైవేట్‌ కళాశాలలో అడ్మిషన్లకు అనుమతులు లభించాయి.  

రిపోర్ట్‌ చేయని వారు 208 మంది..
ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు తొలి దశ కౌన్సెలింగ్‌లో 3,289 మందికి సీట్లు కేటాయించారు. వీరిలో 208 మంది విద్యార్థులు నిర్ణీత సమయంలోగా కళాశాలల్లో రిపోర్ట్‌ చేయలేదు. వీరి వివరాలను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటించింది.  

మరిన్ని వార్తలు