వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయండి

25 Jul, 2020 04:55 IST|Sakshi

ఐటీ శాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఐటీ కంపెనీలు మరికొంత కాలం వర్క్‌ ఫ్రం హోంనే కొనసాగించనుండటంతో దానికి అనుగుణంగా ఇంటర్నెట్‌ వ్యవస్థను పటిష్టం చేయాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ఐటీ ఉద్యోగుల్లో 70 శాతం మంది ఇంటి వద్ద నుంచే పనిచేయనుండటంతో  ఇంటర్నెట్‌ కనెక్టివిటీలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. శుక్రవారం మంత్రి మేకపాటి వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

► వర్క్‌హోమ్‌ డిమాండ్‌ పెరుగుతుండటంతో పట్టణాలు, నగరాల్లో ఉచితంగా సేవలందించే విధంగా డిజిటల్‌ సెంటర్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.
► కరోనా నేపథ్యంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అత్యంత కీలకంగా మారింది. దీంతో సైబర్‌ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
► నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్ఛంజ్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలి.
► పరిపాలనా సౌలభ్యం కోసం సొసైటీ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ నెట్‌ వర్క్స్‌ (సాప్‌నెట్‌)ను ఐ అండ్‌ పీఆర్‌ లేదా విద్యా శాఖలోకి, ఏపీ సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ను ఆర్టీజీఎస్‌ పరిధిలోకి, ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ(అపితా),  ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లను ఫైబర్‌ నెట్‌ పరిధిలోకి తీసుకువచ్చే అంశాలపై అధికారులతో సమీక్షించారు. 

మరిన్ని వార్తలు