వలస కార్మికుల వివరాలపై అధ్యయనం ప్రారంభిస్తున్నాం

27 Jul, 2020 18:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: పారిశ్రామిక రంగానికి చేయూతనందించడంలో దేశంలోనే అత్యుత్తమంగా ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని పరిశ్రమలు, ఐటీ, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. 'కోవిడ్‌ సంక్షోభమున్నా అవకాశాలను సృష్టిస్తాం.. అభివృద్ధి సాధిస్తాం. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ప్రణాళిక, సమయపాలనలతో లక్ష్యాలను చేరుతాం. ఆర్థిక, పారిశ్రామిక, రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాం. కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమయ్యింది. దేశ వ్యాప్తంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలు నెమ్మదించాయి. (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయండి)

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను దేశంలోనే ముందు ఆదుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఏప్రిల్ 30న కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను(ఎంఎస్‌ఎంఈ) ఆదుకోవటానికి రూ.1,168 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించాం. జూన్ 30 కల్లా ప్రకటించిన మొత్తాన్ని 2 విడతలుగా చెల్లించాం.  మే, జూన్ నెలల్లో ఎంఎస్ఎమ్ఈలకు రూ.905 కోట్ల పెండింగ్ ప్రోత్సాహక బకాయిలు అందించాం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలకు వెసులుబాటు కోసం విద్యుత్‌ స్థిర ఛార్జీలు రూ.188 కోట్లు మాఫీ చేశాం. మరో రూ.200 కోట్ల నిధితో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు వడ్డీకి రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించాం. ప్రభుత్వ విభాగాలకు అవసరమైన 360 రకాల వస్తువులు, ఇతర సామగ్రిలో 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచి కొనుగోలు చేసి 45 రోజుల్లో బిల్లులు చెల్లించే నిర్ణయాలు అమలు చేస్తున్నాం. (ఇకపై ఉద్యోగ వివరాలకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్..)

మార్చి, ఏప్రిల్ నెలల్లో కరోనా ప్రభావం దేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా పడింది. ముఖ్యంగా ఏపీలోనూ ఆర్థిక, పారిశ్రామిక రంగాలు వెనకబడ్డాయి. అన్ని రాష్ట్రాలలో పరిశ్రమలు మూతపడి,  ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాలపై ఆ ప్రభావం పడింది. కార్మికులు సొంత ఊళ్లకు చేరడంతో పరిశ్రమలలో పనులకు అంతరాయం ఏర్పడింది. కోవిడ్ ప్రభావాన్ని అధిగమించి అభివృద్ధి అంచనాలను మించుతాం. కీలక రంగాలను ఎంచుకుని, ఆర్థికంగా బలపడడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాం. గ్రామీణ స్థాయిలో సొంత ఊళ్లకు వచ్చిన వలస కార్మికుల వివరాలపై అధ్యయనం ప్రారంభిస్తున్నాం. ఉద్యోగం లేని వారి సంఖ్య.. వారిలోని నైపుణ్యం ఏంటి, పరిశ్రమలలో వారిని వినియోగించుకోవడం ఎలా అన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు' మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు