Mekapati Goutham Reddy Sangam Barrage: దశాబ్దాల కల ‘సంగం’ సాకారం 

4 Sep, 2022 03:20 IST|Sakshi
బ్రిటిష్‌ హయాం నాటి సంగం ఆనకట్ట, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శరవేగంగా నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌

ప్రారంభానికి సిద్ధమైన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ 

రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ కమ్‌ బ్రిడ్జి కూడా పూర్తి

ఈనెల 6న జాతికి అంకితం చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

1882–83లో సంగం వద్ద ఆనకట్ట నిర్మించిన బ్రిటీష్‌ సర్కార్‌

ఆనకట్ట శిథిలమవ్వడంతో ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి

2006లో బ్యారేజ్‌ నిర్మాణానికి వైఎస్సార్‌ శంకుస్థాపన

ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం

టీడీపీ హయాంలో కమీషన్ల పనులకే ప్రాధాన్యం ఇస్తూ నాన్చివేత 

జగన్‌ సీఎం కాగానే యుద్ధ ప్రాతిపదికన రూ.131.12 కోట్లతో పూర్తి

నెల్లూరు జిల్లాలో 3.85 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం

సంగం–పొదలకూరు మధ్య ప్రజల రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం..

నెల్లూరు బ్యారేజీ కమ్‌ బ్రిడ్జి ద్వారా నెల్లూరు– కోవూరు మధ్య సవ్యంగా రాకపోకలు

72 గ్రామాల పరిధిలో 99,525 ఎకరాల్లో సాగు నీటి పరిస్థితి మెరుగు 

మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ నిర్మాణం పూర్తి కావడంతో పెన్నా డెల్టాలోని 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి మొత్తంగా 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రధానంగా నెల్లూరుకు ముంపు ముప్పు తప్పింది. చెప్పిన మాట మేరకు యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్‌ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన నిబద్ధతను చాటుకున్నారు. దీనికి తోడు నెల్లూరు బ్యారేజీ కమ్‌ బ్రిడ్జి కూడా రికార్డు సమయంలో పూర్తి కావడం విశేషం.

(మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ పనులను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేశారు. ఈనెల 6న బ్యారేజ్‌ను జాతికి అంకితం చేయనున్నారు.

దీంతో పాటు నెల్లూరు బ్యారేజీ కమ్‌ బ్రిడ్జిని కూడా రికార్డు సమయంలో పూర్తి చేశారు. సంగం బ్యారేజీ నిర్మాణం ద్వారా పెన్నా వరదలను సమర్థవంతంగా నియంత్రించి, ముంపు ముప్పు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలను తప్పించవచ్చు. బ్యారేజ్‌లో 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉండటం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడం ఖాయం. తద్వారా తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌ శాశ్వతంగా పరిష్కరించారు.

శిథిలమైనా పట్టించుకోని దుస్థితి 
నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా నదిపై 1882–83లో బ్రిటీష్‌ సర్కార్‌ 0.9 మీటర్ల ఎత్తున ఆనకట్టను నిర్మించి.. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల కింద ఆయకట్టుకు 1886 నుంచి నీళ్లందించడం ప్రారంభించింది. ఈ ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి.

పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడంతో.. దానిపై 0.3 మీటర్ల మేర ఇసుక బస్తాలు వేసి, నీటిని నిల్వ చేసినా.. ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. సంగం ఆనకట్ట స్థానంలో బ్యారేజ్‌ నిర్మించి, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. అయితే ఆ డిమాండ్‌ను 2006 వరకూ ఎవరూ పట్టించుకోలేదు.
సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ 

స్వప్నం సాకారం దిశగా అడుగులు.. 
నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2006 మే 28న సంగం బ్యారేజ్‌కు శంకుస్థాపన చేశారు. రూ.147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008 మే 21న పనులు చేపట్టారు. మహానేత వైఎస్‌ హయాంలో బ్యారేజ్‌ పనులు పరుగులు తీశాయి. ఈ పనులకు అప్పట్లో రూ.30.85 కోట్లు వ్యయం చేశారు. అయితే మహానేత వైఎస్‌ హఠాన్మరణం సంగం బ్యారేజ్‌ పనులకు శాపంగా మారింది.

కమీషన్లు వచ్చే పనులకే టీడీపీ హయాంలో పెద్దపీట 
సంగం బ్యారేజ్‌ను నిర్మిస్తున్న ప్రాంతంలో పెన్నా నది వెడల్పు 1,400 మీటర్లు. కానీ.. అప్పట్లో సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) చీఫ్‌ ఇంజనీర్‌ 846 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్‌ (కాంక్రీట్‌ నిర్మాణం), ఇరువైపులా 554 మీటర్ల వెడల్పుతో మట్టికట్టలు నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించారు. బ్యారేజ్‌ నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడటంతో డిజైన్‌లలో మార్పులు చేయాలని 2013లో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం 2013 నవంబర్‌ 23న నిపుణుల కమిటీని నియమించింది.

బ్యారేజ్‌ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ.. 1,195 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్‌ (కాంక్రీట్‌ కట్టడం)  నిర్మించాలని 2014లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఆమోదించడంలో రెండేళ్ల పాటు జాప్యం చేసిన టీడీపీ సర్కార్‌.. ఎట్టకేలకు 2016 జనవరి 21న బ్యారేజ్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని రూ.335.80 కోట్లకు పెంచింది.

బ్యారేజ్‌ను 2017కు పూర్తి చేస్తామని ఒకసారి.. 2018కి పూర్తి చేస్తామని మరోసారి.. 2019కి పూర్తి చేస్తామని ఇంకోసారి ముహూర్తాలను మారుస్తూ వచ్చింది. టీడీపీ సర్కార్‌ కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బ్యారేజ్‌లో 85 పియర్స్‌(కాంక్రీట్‌ దిమ్మెలు)ను సగటున 22 మీటర్ల చొప్పున అరకొరగా పూర్తి చేసింది. చేసిన పనుల కంటే.. ధరల సర్దుబాటు(ఎస్కలేషన్‌), పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అధికంగా బిల్లులు చెల్లించింది. రూ.86.10 కోట్లను ఖర్చు చేసినా బ్యారేజ్‌ పనులను ఒక కొలిక్కి తేలేకపోయింది.
పెన్నా నదిపై సంగం బ్యారేజీ దిగువ వైపు నుంచి... 

అటు కరోనా, ఇటు వరద.. అయినా పూర్తి
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించి, శరవేగంగా పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 2020 మార్చి నుంచి 2021 ఆఖరుదాకా కరోనా మహమ్మారి విజృంభించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో పెన్నా నది ఉప్పొంగి ప్రవహించింది.

2019–20 లో 42.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల నీరు నెల్లూరు బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిందంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో అంచనా వేసుకోవచ్చు. ఓ వైపు కరోనా మహమ్మారి తీవ్రత.. మరో వైపు పెన్నా వరద ఉధృతితో పోటీ పడుతూ సంగం బ్యారేజ్‌ పనులను సీఎం వైఎస్‌ జగన్‌ పరుగులెత్తించారు. బ్యారేజ్‌ 85 పియర్లను 43 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయించారు.

ఈ పియర్స్‌ మధ్య 12 మీటర్ల ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు, కోతకుగురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 గేట్లు (స్కవర్‌ స్లూయిజ్‌) బిగించారు. వరద ప్రవాహం వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి విద్యుత్‌తో పనిచేసే హాయిస్ట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

బ్యారేజ్‌కు ఎగువన ఎడమ వైపున 3.17 కిలోమీటర్లు, బ్యారేజ్‌కు కుడి వైపున 3 కిలోమీటర్ల పొడవున కరకట్టలను పటిష్టం చేశారు. సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్‌పై రెండు వరుసల రోడ్‌ బ్రిడ్జిని పూర్తి చేశారు. కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌లను పూర్తి చేశారు. ఈ పనులను రూ.131.12 కోట్ల ఖర్చుతో పూర్తి చేసి.. నెల్లూరు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశారు. 

నెల్లూరు బ్యారేజీ కమ్‌ బ్రిడ్జి ప్రాజెక్టు సైతం  
రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ కమ్‌ బ్రిడ్జిని కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసింది. జలయజ్ఞంలో భాగంగా దివగంత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008–09లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పదేళ్ల తర్వాత ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా పూర్తి చేశారు. నెల్లూరు నగరానికి సమీపాన ఇప్పటికే ఉండే పాత ఆనకట్టకు వంద మీటర్ల ఎగువున ఇంకొక కొత్త బ్యారేజీ కమ్‌ బ్రిడ్జి ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసింది.

ఈ ప్రాజెక్టును కూడా ఈ నెల 6న జాతికి అంకితం చేయనున్నారు. 13 ఏళ్ల క్రితం మొదట్లో రూ.147.20 కోట్ల అంచనాతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో 2014కు ముందే రూ.86.62 కోట్ల మేరకు పనులు పూర్తయ్యాయి. తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ.274.83 కోట్లకు పెరిగింది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రూ.71.54 కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనతో కాకుండా ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం కమీషన్లకు అవకాశం ఉన్న పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపింది.

అయితే 2019లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించారు. కేవలం మూడేళ్లలో రూ.77.37 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు ప్రధాన కాంక్రీట్, ఇతర మట్టి పనులన్నింటినీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా 72 గ్రామాల పరిధిలోని 99,525 ఎకరాల్లో సాగు నీటి పారుదల అవకాశాలు మెరుగు పడతాయి.

నెల్లూరు– కోవూరుల మధ్య రాకపోకల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఆనకట్టకు ఎగువన ఇన్‌ఫిల్ట్రేషన్‌ బావులు నిండడం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరిగి నెల్లూరు çనగరం.. ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు తాగునీటి  అవసరాలు తీరే అవకాశం ఉంది. 

ఇదో మహోజ్వల ఘట్టం
సంగం బ్యారేజ్‌ నిర్మాణాన్ని మహానేత వైఎస్సార్‌ ప్రారంభిస్తే.. ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేసి ఈ నెల 6న జాతికి అంకితం చేయనుండటం మహోజ్వల ఘట్టం. కరోనా తీవ్రత, పెన్నా వరద ఉధృతిని తట్టుకుని.. బ్యారేజ్‌ను పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజలకు మేకపాటి గౌతమ్‌రెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ బ్యారేజ్‌కు ఆయన పేరు పెట్టాం. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల ఆయకట్టుకు నీళ్లందించి సస్యశ్యామలం చేస్తాం.     
– అంబటి రాంబాబు, జల వనరుల శాఖ మంత్రి

రికార్డు సమయంలో పూర్తి  
సీఎం ఆదేశాల మేరకు బ్యారేజ్‌ను రికార్డు సమయంలో పూర్తి చేశాం. 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ఇది దోహదపడుతుంది. బ్యారేజ్‌లో నిత్యం 0.45 టీఎంసీలను నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. బ్రిడ్జితో సంగం–పొదలకూరు మధ్య రవాణా సమస్యకు పరిష్కారం లభించింది.  
 – సి.నారాయణరెడ్డి, ఈఎన్‌సీ  

నాణ్యతకు ప్రాధాన్యత
సంగం బ్యారేజ్‌ పనులను అత్యంత నాణ్యతతో శరవేగంగా పూర్తి చేశాం. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాధాన్యత ప్రాజెక్టుగా సంగం బ్యారేజ్‌ను ప్రకటించి.. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మేరకు గడువులోగా పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల కలను సీఎం వైఎస్‌ జగన్‌ నిజం చేశారు. 
    – హరినారాయణ రెడ్డి, సీఈ, తెలుగుగంగ 

మరిన్ని వార్తలు