‘నవంబర్‌లో 'ఇండస్ట్రీస్ స్పందన' ప్రారంభం’

21 Oct, 2020 14:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు ప్రజలు మరింత దగ్గరయ్యేందుకు, ఏ సమస్యకైనా సత్వరమే పరిష్కారం దిశగా పరిశ్రమల శాఖ అడుగులువేస్తోంది. ఈ మేరకు పరిశ్రమల శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో వెలగపూడి సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఈడీబీ, పరిశ్రమల నీటి అవసరాలు, ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీపై చర్చించారు. అలాగే పరిశ్రమల శాఖకు సంబంధించిన ప్రత్యేక 'స్పందన' వెబ్ సైట్‌ను నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ వెబ్ సైట్ ప్రారంభంతో పరిశ్రమల శాఖలో జవాబుదారీ, పారదర్శకత పెరుగనుందన్నారు. పరిశ్రమలకు సంబంధించిన ఎలాంటి సందేహం, ఫిర్యాదైనా సత్వరమే స్పందన లభించనుందని తెలిపారు చదవండి: 20 స్కిల్‌ కాలేజీలకు భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తి

'ఫీడ్ బ్యాక్' వెసులుబాటుకు చోటు
పరిశ్రమలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 'గ్రీవెన్స్' స్వీకరించేలా రూపకల్పన చేసినట్లు, ఫిర్యాదు, సమస్య సబ్ మిట్ మీట నొక్కిన వెంటనే ఫిర్యాదుదారుడికి మెసేజ్ వచ్చే సౌలభ్యం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వైఎస్సార్‌ ఏపీ వన్‌లను కూడా చేర్చాలని మంత్రి ఆదేశించారు. ఫిర్యాదు స్వీకరణ, పరిష్కారం తదితర పరిణామాలపై ఫిర్యాదుదారుడి ద్వారా 'ఫీడ్ బ్యాక్' వెసులుబాటుకు చోటు కల్పించాలన్నారు. పారిశ్రామిక, పెట్టుబడిదారులకు ఇండస్ట్రీస్ వర్చువల్ ఎంట్రిప్రూనర్ డిజిటల్ అసిస్టెన్స్, చాట్ బోట్ సౌకర్యంలో 'వేద' పేరుతో ఉన్న యానిమేషన్ బొమ్మ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. సముద్ర వాణిజ్యంలో ఏపీ నంబర్‌ 1

ఏపీ బొమ్మల తయారీ బోర్డు' ఏర్పాటు
బొమ్మల తయారీ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విశాఖ, గోదావరి జిల్లాలలో బొమ్మల తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేయాలన్నారు. అందుబాటులో ఉన్న భూములను బట్టి ముందుగానే కొంత భూమిని ఉంచాలని ఆదేశించారు. 'ఏపీ బొమ్మల తయారీ బోర్డు' ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి తెలిపారు. కడపలోని కొప్పర్తి కేంద్రంగా ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. దీనిపై స్పందించిన పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది ఎమ్ఎస్ఎమ్ఈ యాదవపురంగా కేంద్రంగా అందుకు అనువైన చోటుందన్నారు. 

'పాలసీ ల్యాబ్' ప్రస్తుత పరిస్థితిపై చర్చ
కాగా ‘సోమశిల కాలువ ద్వారా చిత్తూరు-నెల్లూరు కేంద్రంగా పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలపై దృష్టి పెట్టాలన్నారు. పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలకు సంబంధించి డీపీఆర్ తయారు దిశగా సమాలోచన చేయాలన్నారు. ఏపీ టెక్స్ట్ టైల్స్, గార్మెంట్స్ పాలసీ 2018-23 ఆపరేషనల్ గైడ్ లైన్స్, ఐఎస్ బీతో భాగస్వామ్యం పై ఆరా తీశారు. ఎక్స్‌పోర్ట్‌లపై పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్ లంకా, ఐటీ శాఖ సలహాదారులు శ్రీనాథ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, లోకేశ్వరరెడ్డి, తదితరులు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు