‘అక్టోబర్‌లో 5 స్కిల్‌ కాలేజీల ప్రారంభం’

25 Jul, 2020 14:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఈ ఏడాది అక్టోబర్‌లో లాంఛనంగా 5 స్కిల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు ఐటీ, వాణిజ్య శాఖ మం‍త్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.  శనివారం ఆయన నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి. అనంతరాము, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అక్టోబర్‌లో 5 నైపుణ్య కళాశాలను లాంఛనంగా ప్రారంభించడమే లక్ష్యమని తెలిపారు. చదువు విలువను ప్రపంచానికి చాటిన గాంధీ జయంతి రోజు 4 స్కిల్‌ కాలేజీల ప్రారంభానికి శ్రీకారం చుట్టామన్నారు. కడప, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో స్కిల్‌ కాలేజీల ప్రారంభోత్సం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా  జరగనుందని వెల్లడించారు. (చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయండి)

వచ్చే ఏడాది జనవరిలో కొత్తగా మరో 25 స్కిల్‌ కాలేజీల ప్రారంభానికి సన్నద్దం కావాలని ఆయన అధికారులకు సూచించారు. అనుకున్న సమయానికి అనుకున్నవి పూర్తి చేసేలా కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా 30 కాలేజీల పర్యవేక్షణకు  'ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్'ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. అక్టోబర్‌లో ప్రారంభించే 5 కాలేజీలు పూర్తయ్యాయని ప్రస్తుతం కాలేజీల డిజైన్లు, లేఔట్లకు  తుది మెరుగులు దిద్దుతున్నట్లు చెప్పారు. గతేడాది చివరిన నైపుణ్యాశాఖ బృందం భువనేశ్వర్‌లోని సెంచూరియన్ స్కిల్ యూనివర్సిటీలో పర్యటించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రానున్న స్కిల్ కాలేజీలలో సైతం 'సెంచూరియన్' స్థాయి ప్రమాణాలుండాలని దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. స్కిల్ కాలేజీ ఆకృతులు, సైట్లకు సంబంధించిన వ్యవహారాలను పరిశీలించేందుకు ప్రత్యేక ఆర్కిటెక్‌ బృందం కూడా పర్యటించనుందని వెల్లడించారు. (చదవండి: ఇకపై ఉద్యోగ వివరాలకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్..)

ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా సీఎస్ఆర్ నిధుల సమీకరణపై మరింత దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం త్వరలో  స్కిల్‌కు సంబంధించిన కోర్సులు, కరికులమ్‌లపై హై నెట్ వర్క్ ఇండస్ట్రీస్ వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా చెప్పారు. కొత్త కోర్సులు, ప్రాధాన్యత రంగాలపై టాప్ కంపెనీల నిపుణులు, విద్యావేత్తలతో చర్చించిన తర్వాత అమోదించనున్నామన్నారు. ఇప్పటికే కీలక రంగాలలో యువతకు భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలుండే 20 కోర్సులపై అధ్యయనం చేశామని, ప్రపంచ స్థాయి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి హై లెవల్ కమిటీ, ఐఎస్‌బీ ఆధ్వర్యంలో శిక్షణ క్లాసులు నిర్వహించనున్నట్లను పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన కోర్సులు, మానవవనరుల వివరాలపై  సర్వేకు కూడా నైపుణ్యశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. త్వరలోనే యాప్ ద్వారా సర్వే ప్రారంభించే అవకాశం  ఉందని మంత్రి వెల్లడించారు.  

మరిన్ని వార్తలు