ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డిజిటల్ లైబ్రరీ: మంత్రి మేకపాటి

12 May, 2021 23:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: అకడమిక్ రిసోర్స్ సెంటర్‌ని వర్చువల్‌గా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి  ప్రారంభించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లైబ్రరీలో యువతను ఆకర్షించే టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్‌వేర్ పుస్తకాలకు పెద్దపీట వేయనున్నారు. కంప్యూటర్ల ద్వారా చదువుకునేందుకు వీలుగా అకడమిక్ రిసోర్స్ సెంటర్ యువతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐటీ వెబ్‌ పోర్టల్ డిజైనింగ్స్‌ను  మంత్రి గౌతమ్‌రెడ్డి పరిశీలించారు. 

వెబ్‌ పోర్టల్‌ను త్వరలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి మేకపాటి తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీని వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు వెల్లడించారు. ఐటీ సేవలకు సంబంధించి సలహాలు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు స్వీకరించి.. పరిష్కరించేలా తీర్చిదిద్దిన వెబ్‌ పోర్టల్‌ను మంత్రి గౌతమ్‌రెడ్డి  పరిశీలించారు. ప్రభుత్వ సేవలన్నింటినీ వినియోగదారులకు అందుబాటులోకి తేవడం శుభపరిణామన్నారు. నిరక్ష్యరాస్యులకు చదువుకున్న వారు సహకరించేలా ఈ గవర్నెన్స్‌ ద్వారా.. ఫిర్యాదులు, పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఇచ్చినా పరిశీలించి.. అవసరమైన సేవలందించే వీలుగా వెబ్‌సైట్‌ ను ఐటీ శాఖ రూపోందించారు. 

ఏపీఐఐసీ అధికార వెబ్‌సైట్‌ని కూడా ఐటీశాఖ రూపొందించిన.. అదే వెబ్‌సైట్‌లో అనుసంధానించాలని మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. ఐటీశాఖలో జరిగే కార్యక్రమాలు, ఫొటో గ్యాలరీ, ఈవెంట్స్,..పత్రికా ప్రకటనలకు వీలుగా సమాచారం అందుబాటులో ఉండేలా పోర్టల్ డిజైన్ ఉంటుంది. కాగా వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అయిన ప్రతి వినియోగదారుడికి.. అన్నిరకాల సేవలందేలా సంబంధిత ఏజెన్సీల అనుసంధానంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్ ప్రక్రియను ఆగస్టు 15లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. 35 వేల మందికిపైగా యువతకు ఉద్యోగాలను 10 కంపెనీలు  అందించనున్నాయి.

ఏపీలో రూ.800 కోట్ల పెట్టుబడులకు సంబంధించి డీపీఆర్ పూర్తి చేసిన.. కంపెనీలపై ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్‌రెడ్డి  చర్చించారు. సంబంధిత కంపెనీల సీఈవో, ఎండీలతో త్వరలో గౌతమ్‌రెడ్డి సమావేశం కానున్నారు. డేటా సెంటర్ల స్థాపనకు ముందుకొచ్చిన 3 ప్రతిపాదనలను మంత్రి పరిశీలించారు. ఐటీ శాఖలో ఏపీటీఎస్ ద్వారా ఆదాయ మార్గాలను, అందించాల్సిన సేవలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్షన్, నెట్‌వర్క్‌ కనెక్టివిటీ వివరాలను మంత్రి గౌతమ్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఐటీ కాన్సెప్ట్‌ సిటీలపై ప్రపంచస్థాయి నిపుణుల నుంచి ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్ ఇంట్రస్ట్‌ను కోరారు.

ఐటీ శాఖ  పరిశ్రమలు, ఐటీ శాఖలను భాగస్వామ్యం చేస్తూ ప్రణాళిక, కార్యాచరణ కాన్సెప్ట్‌ సిటీల నిర్మాణంలో అంతర్జాతీయ విధివిధానాలను ఇనుమడింపజేయాలని మంత్రి పేర్కొన్నారు. తదనుగుణంగా నమూనాల పరిశీలన, పరిశోధన అవసరం. వీటన్నింటినీ పరిశీలించి కొలిక్కి వచ్చేందుకు మేధోమధనం జరగాలని, ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి బిడ్డర్లను తీసుకొచ్చే బాధ్యతను కమిటీకి ఇవ్వాలి. స్మార్ట్‌సిటీలకు మించి.. అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కాన్సెప్ట్‌ సిటీల నిర్మాణం జరగాలని మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: కార్యాచరణ రూపొందించండి: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు