మహిళలకు రక్షణ కల్పిస్తాం

18 Oct, 2020 05:28 IST|Sakshi
దివ్య తేజస్విని కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న హోం మంత్రి సుచరిత

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత 

దివ్య కుటుంబసభ్యులకు పరామర్శ 

గుణదల(విజయవాడ తూర్పు): మహిళలకు రక్షణ కల్పించే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హోం శాఖా మంత్రి మేకతోటి  సుచరిత స్పష్టం చేశారు. విజయవాడ నగరంలోని క్రీస్తురాజపురంలో ప్రేమోన్మాది చేతిలో దారుణహత్యకు గురయిన దివ్య తేజస్విని కుటుంబసభ్యులను శనివారం పరామర్శించారు. అనంతరం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. దివ్య కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.  మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వేధింపులు, హత్యలు గణనీయంగా తగ్గాయన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై అత్యాచారాలు అధికంగా ఉండేవని సుచరిత తెలిపారు.  

దివ్య తల్లిదండ్రుల లేఖ 
ఆడపిల్లలకు జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావిస్తూ మంత్రి సుచరితకు దివ్య తల్లిదండ్రులు లేఖ అందజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు