'పరిమితులకు లోబడే విడుదల చేస్తున్నాం': సుచరిత

6 Nov, 2020 20:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మహిళా ఖైదీల విషయంలో దేశ చరిత్రలోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని హోమ్‌ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా ఖైదీల విషయంలో సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు శిక్ష పూర్తి చేసుకున్న వారిని విడుదల చేయాలని నిర్ణయించారు. జైల్లో ఉన్న మహిళా ఖైదీలకు వివిధ వృత్తులపై శిక్షణ ఇస్తున్నాము. వారు బయటకు వచ్చిన తరువాత వాళ్ల కాళ్ళపై వారు నిలిచేలా శిక్షణ ఇస్తున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 137 మంది ఖైదీలలో 55 మంది విడుదలకు అర్హత కలిగి ఉన్నారు. పూర్తి పరివర్తనతో బయటకు వచ్చిన ఖైదీలు కుటుంబాలతో సంతోషంగా ఉంటారని భావిస్తున్నాము. పురుష ఖైదీల విడుదలకు సంబంధించి జనవరి 26 సందర్బంగా నిర్ణయం తీసుకుంటాము. డిగ్రీ చదివిన, చదువుతున్న ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు. కుట్టు, ఎంబ్రాయిడరీ, అల్లికలు వంటి చేతి వృత్తులు కూడా శిక్షణ ఇస్తున్నాము.    (నడి రోడ్డు మీద లంచావతారం..)

నేరంలో వారి పాత్ర ఎంత అనే విషయంపై కూడా విచారణ చేసి నిర్ణయించాం. మహిళా ఖైదీల విడుదల ఒకేసారి జరగడం చారిత్రాత్మకం. కడప, విశాఖ జైళ్ళను సందర్శించినపుడు అక్కడి మహిళ ఖైదీల అభ్యర్ధన మేరకు విడుదలకు సిద్ధం చేశాం. ఒక వారం లోపు వీరందరినీ విడుదల చేయడం జరుగుతుంది. జనవరి 26న మరలా నిర్ణయం తీసుకుంటాం. కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే విడుదల చేస్తున్నాం' అని మంత్రి సుచరిత పేర్కొన్నారు.  (అబ్బెబ్బే... ప్యాకేజి మాటే ఎత్తలేదు)

ఏపీ జైళ్ల శాఖ డీజీ అహసన్‌ రెజా మాట్లాడుతూ.. ఏపీలో నాలుగు జైళ్ళ నుంచి మహిళా ఖైదీలను విడుదల చేస్తున్నాం. ఓ మహిళ ఖైదు కావడంతో ఓ కుటుంబం ఇబ్బంది పడుతుంది. సీఎం జగన్ నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఖైదు, శిక్షా కాలం ఐదు సంవత్సరాలకు తగ్గించాం అని ఆయన వివరించారు. 

మరిన్ని వార్తలు