మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అక్టోబర్ 9న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, వాయువ్య బంగాళాఖాతం.. దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర మహారాష్ట్ర తీరం వరకు దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ, ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.