టెన్త్‌ విద్యార్థులకు మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు

11 Aug, 2021 03:04 IST|Sakshi

సెప్టెంబర్‌ 5 వరకు ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌లో పొందవచ్చు

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు, సర్టిఫికెట్‌ మంజూరు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2020 – 21 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలు విడుదల చేశామని, ఉన్నత విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు పరీక్ష రుసుముతో పాటు రూ.80 చెల్లించిన  విద్యార్థులకు మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ను సంబంధిత పాఠశాల లాగిన్‌ లో పొందుపరిచామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు.  సర్టిఫికెట్‌ కలర్‌ కాపీని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అందజేయాలన్నారు.

ఈ అవకాశం సెప్టెంబర్‌ 5 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత విద్యార్ధులు మరోసారి రూ.80 రుసుము చెల్లించి, ఆన్‌లైన్‌లో ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకొని సర్టిఫికెట్‌ పొందాలని చెప్పారు. 2021 ఏడాది మాత్రమే కాకుండా అంతకు ముందు సంవత్సరాల్లో పదో తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్థులు కూడా ఈ సంవత్సరం నుంచి మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ కోసం ఆన్‌లైన్‌లో ప్రభుత్వ పరీక్షలు సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు తేదీ నుంచి 30 రోజుల వరకు మాత్రమే వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్‌ ఉంటుందన్నారు. దరఖాస్తుకు విధివిధానాలు త్వరలో తెలియచేస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు