నిమ్మగడ్డ రాజీనామాకు మంత్రి కొడాలి నాని డిమాండ్‌

11 Jan, 2021 17:57 IST|Sakshi

కృష్ణ : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్చునిచ్చిన సంగతి తెలిసిందే. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు షాక్‌ ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసింది.  ఈ సందర్భంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశంపై సీఎస్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, అధికారులు వెళ్లి చెప్పినా  పట్టించుకోలేదని,  ప్రజలు ఏమైపోయినా  తన పదవి అయిపోయే లోపు ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ చూశారని మండిపడ్డారు. ఇప్పుడు 'హైకోర్టు తీర్పు కుక్క ​కాటుకు చెప్పు దెబ్బలా, నిమ్మగడ్డ మూతి పళ్లు రాలేలా తీర్పు వచ్చింది' అని మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  (నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం )

కోవిడ్ ప్రబలి ప్రజలు చనిపోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని నిమ్మగడ్డ చూశారని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలు అమలు చేసిన వ్యక్తి నిమ్మగడ్డ అని.. రాజ్యాంగ పదవిలో ఉండి ఆ పదవికి చేటు తెచ్చిన వ్యక్తి నిమ్మగడ్డ అని  కొడాలి నాని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నైతిక బాధ్యతతో  నిమ్మగడ్డ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుతో వ్యాక్సినేషన్ క్యార్యక్రమంతో ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రభుత్వం చూస్తోందని, త్వరలోనే కోవిడ్ వారియర్స్‌కి  వ్యాక్సిన్ ఇచ్చి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. 

విజయవాడ: ఎన్నికల షెడ్యూల్‌ను హై కోర్టు సస్పెండ్ చేయటం ప్రజా విజయం అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఇది నియంతృత్వ పోకడలకు పోయే రాజ్యాంగేతర శక్తులకు చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ప్రజావిశ్వాసం పొందిన సీఎం జగన్‌ని  కుట్రలతో ఎదుర్కొవాలనుకోవాలనుకోవడం మూర్కత్వం అని తెలిపారు. ఏపీ హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం అని, ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేయటాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. నిమ్మగడ్డ రమేష్ ఇప్పటికైనా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలన్నారు. (నిమ్మగడ్డకు షాక్‌! పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రద్దు )

మరిన్ని వార్తలు