ఏపీ: నేటి నుంచి ఇంటర్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌

29 Apr, 2021 15:42 IST|Sakshi

సాయంత్రం ఆరు గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌

రాష్ట్రవ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలు

అత్యధికంగా తూగో.. అత్యల్పంగా గుంటూరులో పరీక్షా కేంద్రాలు

సాక్షి, విజయవాడ: ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు లేవని, మే5 నుంచి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్‌ పరీక్షలు అనివార్యమని, కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మే 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థలు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు(ఏప్రిల్‌ 29) సాయంత్రం ఆరు గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.

ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం. ఇందకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. గతేడాదితో పోల్చితే ఈ సారి అదనంగా 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 146 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా గుంటూరులో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాకు కోవిడ్ స్పెషల్ అధికారిని నియమించాం. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు శానిటైజ్ చేస్తాం. ప్రతి పరీక్షా కేంద్రంలో థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేశాం. విద్యార్థుల భవిష్యత్, భద్రత ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. 

‘‘ప్రతి సెంటర్‌లో ఒక పారా మెడికల్ సిబ్బందితో పాటు ఐసోలేషన్‌ రూమ్ ఏర్పాటు చేస్తాం. కోవిడ్ లక్షణాలు ఉంటే వారిని ఐసోలేషన్‌ రూమ్‌లో పరీక్ష రాయిస్తాం. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణ జరపనున్నాం. దేశంలో ఎక్కడా ఇంటర్ పరీక్షలు రద్దు చేయలేదు. అన్ని భద్రతా ప్రమాణాలతో పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దు’’ అని సురేష్‌ కోరారు. 

చదవండి: సీఎం జగన్‌ నన్ను బతికిస్తున్నాడమ్మా..

మరిన్ని వార్తలు