ప్రభుత్వాస్పత్రుల్లో ‘రెమిడెసివర్‌’ కొరత లేదు: ఆళ్ల నాని

26 Apr, 2021 14:08 IST|Sakshi

ఆక్సిజన్ వృథా కాకుండా మెడికల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలి

104కు కాల్ చేసిన మూడు గంటల్లో బెడ్‌ కేటాయించాలి

కరోనా నివారణ చర్యలపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష

సాక్షి, గుంటూరు: ఆక్సిజన్ వృథా కాకుండా మెడికల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. సోమవారం ఆయన కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వాస్పత్రుల్లో రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెమిడెసివర్ కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు.

ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 40 బెడ్స్‌ ఉన్న ఆస్పత్రులను కోవిడ్ సెంటర్లుగా అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. ప్రైమరీ కాంటాక్ట్‌ అందరికీ పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కోవిడ్‌ టెస్టుల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. 104కు కాల్ చేసిన మూడు గంటల్లో బెడ్‌ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.

ఆక్సిజన్ ఆడిటింగ్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
ఆస్పత్రుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆక్సిజన్ ఆడిటింగ్ ప్రారంభించింది. ఆస్పత్రుల వారీగా సరఫరా అయ్యే ఆక్సిజన్ లెక్కలు తీయాలని నిర్ణయించింది. రోజువారీ వినియోగం, ఆక్సిజన్ పడకలపై ప్రభుత్వం ఆరా తీసింది. ఆస్పత్రిలో ఎన్ని ట్యాంకుల ఆక్సిజన్ వాడారనే దానిపై ఆడిటింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది.

రోజువారీ అవసరాలకు 330 టన్నుల ఆక్సిజన్ కావాలని.. ప్రస్తుతం 290 టన్నుల ఆక్సిజనే అందుబాటులో ఉందని వైద్యశాఖ తెలిపింది. ఆక్సిజన్ సరఫరా మెరుగుపరిచేందుకు ప్రత్యేక అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆక్సిజన్ సిలిండర్లు, నెట్రోజన్ ట్యాంకర్లను ప్రభుత్వం మార్పులు చేస్తోంది. రాష్ట్రంలోని 42 ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి ఆస్పత్రులకు సరఫరా జరుగుతుంది. ఆక్సిజన్ సరఫరాకు ఇప్పటికే ప్రభుత్వం జిల్లాస్థాయిలో జేసీకి బాధ్యతలు అప్పగించింది. భువనేశ్వర్, బళ్లారి, విశాఖ నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది.

సాంకేతిక లోపం వల్లే..: మంత్రి బొత్స
విజయనగరం: మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరించామని.. సాంకేతిక లోపం వల్లే  సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో రెండు ప్లాంట్‌లు నిర్వీర్యంగా ఉన్నాయని.. పునరుద్ధరించేందుకు సీఎం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒడిశా, కర్ణాటక నుంచి ఆక్సిజన్ రప్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు.

చదవండి: ఏపీ: అందుబాటులో 33 వేల బెడ్స్: కృష్ణబాబు
ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలే‍దు: విజయనగరం కలెక్టర్

మరిన్ని వార్తలు