వరద పరిస్థితి పై కృష్ణా, గుంటూరు కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి
సాక్షి, అమరావతి: కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ సూచించారు. ఆయన ఆదివారం కృష్ణా,గుంటూరు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడారు. రాత్రికి ప్రకాశం బ్యారేజీకి వరద 6 లక్షల క్యూసెక్కులు దాకా వచ్చే అవకాశం ఉండటంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు,దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన పునరావాస చర్యలు తీసుకోవాలని మంత్రి అనిల్ ఆదేశించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఆయా జిల్లాలో ఇరిగేషన్ సీఈలతో మంత్రి అనిల్ ఫోన్లో మాట్లాడారు. మూడు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేవిధంగా చర్యలు చేపట్టాలని మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆదేశించారు.