ఆ సినిమాలకు పెట్టిన ఖర్చెంత.. పవన్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఎంత?

24 Dec, 2021 11:40 IST|Sakshi

సినీ హీరో నాని వ్యాఖ్యలపై మంత్రి అనిల్‌కుమార్‌  స్పందన

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు  మెచ్చుకుంటుంటే సినిమా హీరోలకు వాళ్ల రెమ్యునరేషన్‌ తగ్గుతుందన్న బాధ తప్ప మరేమీ కాదు..’ అని జలవనరులశాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యానించారు. నెల్లూరులో శుక్రవారం మాట్లాడిన మంత్రి.. సినీ హీరో నాని వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. ఉదాహరణకు సినిమా తీసేందుకు రూ.100 ఖర్చవుతుంటే తీసేందుకు రూ.80, మిగిలిన ఖర్చు రెమ్యునరేషన్‌కు అయితే సబబుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రూ.80 ఆ నలుగురి జేబుల్లోకి పోతుంటే రూ.20 సినిమాకి ఖర్చవుతోందని, ఆ 80 రూపాయలను ప్రజలపై రుద్దడం ఏమిటని ప్రశ్నించారు.

చారిత్రాత్మక, సందేశాత్మక చిత్రం తీసి బడ్జెట్టు పెరిగిందంటే టికెట్ల ధరలను పెంచమని ప్రభుత్వాన్ని కోరితే కొన్ని సందర్భాల్లో సౌత్‌ ఇండియాలో టికెట్ల ధర పెంచిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. అయితే హీరోకు, డైరెక్టర్‌కు, మ్యూజిక్‌ డైరెక్టర్‌కు, హీరోయిన్లకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చి ఆ మొత్తాన్ని ప్రజలపై రుద్దడం ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల రూ.70 కోట్లతో ఓ సినిమా తీశారని, హీరోకు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల రెమ్యునరేషన్‌ పోతే మిగిలిన నలుగురికి రూ.10 కోట్లు పోగా.. మిగిలిన రూ.10 కోట్లు మాత్రమే సినిమాకు అయిన ఖర్చని చెప్పారు. ఈ విధంగా జరుగుతుంటే సినిమా వాళ్ల దోపిడీ ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమౌతోందన్నారు.

ఇటీవల వకీల్‌సాబ్, భీమ్లానాయక్‌ సినిమాలు తీసేందుకు అయిన ఖర్చు ఎంత? ఆయన రెమ్యునరేషన్‌ ఎంత? అని నిలదీశారు. ప్రజలను ఉద్ధరిస్తామనే హీరో ఆ రూ.50 కోట్లు తీసేస్తే ప్రజలకు టికెట్ల ధరలు తగ్గుతాయి కదా అన్నారు. తనకు క్రేజ్‌ ఉందని, ఆ క్రేజ్‌ను ఎక్కువ రేటుకు అమ్ముకోవడమే కదా? అని ప్రశ్నించారు. సినిమా స్కోప్‌ పెద్దదని, సినిమా విస్తరణ పెరిగిందని చెప్పుకొంటున్నారని, వాస్తవానికి ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్లలో హీరోల రెమ్యునరేషన్‌ కోట్లాది రూపాయల్లో కనిపిస్తోంది తప్ప సినిమా స్కోప్‌ ఏమేరకు పెరిగిందో ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడుతోందో తెలుస్తోందని చెప్పారు. 

పవన్‌ అభిమానులు తెలుసుకోండి
పవన్‌కల్యాణ్‌ అభిమానులూ.. ‘మేం సినిమాల్లో నుంచే వచ్చాం. ఆయనకు కటౌట్‌లు పెట్టి మాలలు వేసి మీకంటే ముందు నష్టపోయాం. అప్పడు తెలియలేదు. ఇప్పడు తెలుస్తోంది. మా ముందు తరం వాళ్లు అలాగే తెలుసుకున్నారు. రేపు మీ తరం వాళ్లు తెలుసుకుంటారు. అభిమానం వెర్రిలో తల్లిదండ్రుల డబ్బులను వృధా చేయవద్దు. వాస్తవాలు తెలుసుకోండి..’ అని మంత్రి పేర్కొన్నారు.  

చదవండి: (తిరుమల శ్రీవారి టికెట్లకు ఫుల్‌ డిమాండ్‌)

మరిన్ని వార్తలు