AP Minister: కేటీఆర్‌ వస్తే రోడ్లు ఎలా ఉన్నాయో చూపిస్తా: మంత్రి బొత్స కౌంటర్‌

29 Apr, 2022 14:42 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీలో మౌలిక సదుపాయాలపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. హైదరాబాద్‌లోనే కరెంట్‌ లేదని, స్వయంగా తనకే ఆ అనుభవం ఎదురైందని కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ఏపీ గురించి కేటీఆర్‌కు ఎవ‌రో స్నేహితుడు చెప్పాడేమో కానీ తాను నిన్న‌టి వరకు హైద‌రాబాద్‌లోనే ఉన్నానని తెలిపారు. జనరేటర్‌ వేసుకొని ఉండివచ్చానన్నారు. తెలంగాణ‌లో ప‌రిస్థితుల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసినప్పటికీ తాను ఎవ‌రికి చెప్పుకోవడం లేదు క‌దా అని పేర్కొన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా మాట్లాడటం కరెక్ట్‌ కాదన్నారు.

తాను ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్డుమీదే నిలబడి మాట్లాడుతున్నానని, కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వస్తే ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో స్వయంగా చూపిస్తానని పేర్కొన్నారు.  త‌మ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోవ‌చ్చు గానీ పొరుగు రాష్ట్రాల‌ను తక్కువ చేసి మాట్లాడరాదని అన్నారు. కేటీఆర్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. 

కాగా అంతకుముందు ఏపీలోని రోడ్లపై కేటీఆర్‌ పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో కరెంట్‌, నీళ్లు లేవని అన్నారు. రోడ్లు ధ్వంసమైపోయాయని పేర్కొన్నారు. అక్కడికి బస్సులు పంపి మన వాళ్లకు చూపాలంటూ తన ఫ్రెండ్‌ చెప్పినట్లు తెలిపారు. దేశంలోని అన్ని నగరాల్లోకెల్లా హైదరాబాదే అత్యుత్తమని వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఏపీకి రావాలని, ఇక్కడ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూడాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు