ప్రజారంజక పాలనకు ఏకగ్రీవాలే దర్పణం..

4 Mar, 2021 18:20 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఆదరించిన విధంగానే మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం ప్రజలు తమ పార్టీ అభ్యర్దులకు పట్టం కడతారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలనకు వరుసగా వస్తున్న ఫలితాలే దర్పనమన్నారు. 

సీఎం జగన్‌ నాయకత్వాన్ని ప్రజలు పూర్తిగా విశ్వసించారు కాబట్టే మున్సిపల్‌ ఎన్నికల్లో 20, 797 వార్డులకు గాను 571 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్దులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. పన్నులు పెంచుతామంటూ చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని, సీఎం జగన్‌ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా చేసిన సంస్కరణల్లో భాగంగా చట్టం చేసామే కానీ, చంద్రబాబులా ఇష్టారాజ్యంగా పన్నులు పెంచలేదని తెలిపారు. 

పట్టణ ప్రజల వైద్య అవసరాలు తీర్చే నిమిత్తం సీఎం జగన్ చేతుల మీదుగా త్వరలో 550 అర్బన్ క్లినిక్‌లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నాడు నేడు పథకం కింద స్కూల్‌లు అభివృద్ధి బాట పడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ప్రజలను అభ్యర్ధించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం జరుగనున్న రేపటి 
బంద్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు...దాని కోసం ఏమి చేయాలో అన్నీ చేస్తామని వివరించారు.

మరిన్ని వార్తలు