వివక్ష లేదు.. ‘నవరత్నాల పథకాలు’ యాడ్స్‌పై మంత్రి వేణు క్లారిటీ

18 Mar, 2023 12:59 IST|Sakshi

సాక్షి, అమరావతి: నవరత్నాల పథకాల యాడ్స్‌పై శాసనమండలిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలు అవుతున్నాయన్నారు. పథకాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియజేయడానికి యాడ్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో ఎక్కడా వివక్ష లేదని స్పష్టం చేశారు.  ఇప్పటివరకు రూ.128 కోట్ల ప్రకటనలు ఇచ్చామని తెలిపారు.

‘‘గత తెలుగుదేశం ప్రభుత్వం యాడ్స్ కోసం రూ.449 కోట్లు ఖర్చు చేసింది. యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో పారదర్శకత లేదు. ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్లకి యాడ్స్ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలకు పెద్దపీట వేశారు. ఈనాడు పత్రికకు 50 శాతం రేటు పెంచి రూ.120 కోట్లు యాడ్స్ ఇచ్చారు. సర్కులేషన్ లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి నిబంధనలను తుంగలోకి తొక్కి రూ.72 కోట్ల యాడ్స్ ఇచ్చారు’’ అని మంత్రి మండిపడ్డారు.

‘‘రెండో స్థానంలో ఉన్న సాక్షి పేపర్‌కు కేవలం రూ.30 కోట్ల యాడ్స్ మాత్రమే ఇచ్చారు. గత ప్రభుత్వం యాడ్స్ ఇవ్వటంలో పూర్తిగా పక్షపాత ధోరణి అవలంబించింది. గత ప్రభుత్వంలో ఒక ఏజెన్సీ ద్వారా యాడ్స్ ఇచ్చేవారు. ఆ ఏజెన్సీకి 15 శాతం కమిషన్ ఇచ్చేవారు. మా ప్రభుత్వంలో డైరెక్టుగా యాడ్స్ ఇవ్వటం వల్ల రూ.80 కోట్లు ఆదా చేశాం’’ అని మంత్రి తెలిపారు.
చదవండి: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ సీరియస్‌

మరిన్ని వార్తలు