దేశంలోని ఏడు పుణ్యనదుల్లో గౌతమ్‌రెడ్డి చితాభస్మం..

26 Feb, 2022 09:51 IST|Sakshi
మంత్రి చితాభస్మం సేకరిస్తున్న వేద పండితులు 

పిండ ప్రదానం చేసిన తనయుడు కృష్ణార్జునరెడ్డి 

ఏడు పుణ్యనదుల్లో చితాభస్మం కలిపేందుకు సేకరణ 

మార్చి 3న మెరిట్స్‌ కాలేజీలో పెద్ద కర్మ

సాక్షి, నెల్లూరు(ఉదయగిరి/సంగం): దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కర్మక్రియలను శుక్రవారం ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో వేద పండితులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. తండ్రి గౌతమ్‌రెడ్డికి ఆయన తనయుడు మేకపాటి కృష్ణార్జునరెడ్డి సంగంలోని పెన్నానదిలో త్రివేణిలో పిండ ప్రదానం చేశారు. కుమారుడు మరణాన్ని జీర్ణించుకోలేని మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆయన సతీమణి మణిమంజీరి, గౌతమ్‌రెడ్డి సతీమణి కీర్తి, కుమార్తె సాయి అనన్య ఇతర కుటుంబ సభ్యులు దుఃఖాన్ని భరిస్తూ కర్మక్రతువులు పూర్తి చేశారు.


అర్జన్‌రెడ్డిని ఓదార్చుతున్న మేకపాటి దంపతులు   

ఈ సమయంలో తండ్రిని కోల్పోయి పుట్టేడు దుఃఖంతో రోదిస్తున్న మవవడు అర్జన్‌రెడ్డిని రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి తమ దుఃఖాన్ని అణుచుకుంటూ ఓదార్చుతుండడం అందరిని కంట తడి పెట్టించాయి. బిడ్డలు వేదనను చూసిన బంధువులు, పలువురు అధికారులు కంట చెమ్మ పెట్టారు. గౌతమ్‌రెడ్డి చితాభస్మంను దేశంలోని ఏడు పుణ్యనదుల్లో కలిపే నిమిత్తం ఏడు పాదుకుల్లో సేకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అఖిలప్రియ, ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళేశ్వరరెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ చైత్ర వర్షిణి, మేకపాటి కుటుంబ సభ్యులు రాజారెడ్డి, పృధ్వీరెడ్డి, విక్రమ్‌రెడ్డి, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: (గౌతమ్‌రెడ్డి పేరిట అగ్రికల్చర్‌ యూనివర్సిటీ)

మార్చి 3న మంత్రి పెద్ద కర్మ 
మంత్రి గౌతమ్‌రెడ్డి పెద్ద కర్మ శాస్త్రీయ ప్రకారం కాలం చేసిన 11వ రోజు మార్చి 3వ తేదీ ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దకర్మకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీఐపీలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అ«ధికారులు ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు