కావాలనే చంద్రబాబు దాడి చేయించారు: జోగి రమేష్‌

22 Apr, 2022 16:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటన అందరూ బాధపడాల్సిన దురదృష్టకర సంఘటనని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందించి అన్ని శాఖలను ఆదేశించారని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిందితులను అరెస్ట్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయడం వేగంగా జరిగిపోయాయని అన్నారు. యువతి ఆరోగ్యం మెరుగయ్యే వరకూ ప్రభుత్వం ట్రీట్‌మెంట్‌ అందిస్తుందని చెప్పారు.

శవ రాజకీయాలు చేయడానికి చంద్రబాబు అక్కడికి వచ్చారని మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్‌ నేతలు మహిళా కమిషన్ చైర్మన్‌పై దాడికి దిగారని విరుచుకుపడ్డారు. వేలకోట్ల రూపాయలు అక్కచెల్లెమ్మల అకౌంట్లలో వేసే సమయంలోనే కావాలని చంద్రబాబు ఇక్కడ హడావుడి చేశారని మండిపడ్డారు. ఇది బాధ్యత గల ప్రభుత్వమని, వాసిరెడ్డి పద్మపై దాడి చేయాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాసిరెడ్డి పద్మపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా ఉక్కుపాదంతో అణచివేస్తామని జోగి రమేష్‌ అన్నారు. చంద్రబాబుకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. రిషితేశ్వరి ఘటనలో తాము ఆందోళన చేస్తే ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదని విమర్శించారు. టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులు తాళలేక చిన్నారి మృతి చెందిందని తెలిపారు.

మరిన్ని వార్తలు