చంద్రబాబు.. దొరికిపోయిన దొంగ

7 Mar, 2021 19:18 IST|Sakshi

మంత్రి కొడాలి నాని

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడలో పోటీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు. దోచుకున్న కోట్లాది డబ్బును హెరిటేజ్‌లో దాచుకుంది చంద్రబాబేనంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని అబద్ధాలు చెబుతూ నోటికి ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ తన పాలనలో మద్య నిషేధం విధిస్తే.. చంద్రబాబు ఊరూరా బెల్టుషాపులు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు.

క్షుద్రపూజలు చేశారు కాబట్టే..
‘‘సీఎం జగన్ పాలనలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ఇంటి గడప వద్దకే అందుతున్నాయి. సంక్షేమ పథకాలకు రూ.90 వేల కోట్లు ఖర్చు పెట్టాం. చంద్రబాబు హయంలో టీడీపీ నేతలు ప్రజల సొమ్మును పందికొక్కుల్లా దోచుకున్నారు. దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేసిన నీచుడు చంద్రబాబు. క్షుద్రపూజలు చేశారు కాబట్టే చంద్రబాబు, లోకేష్ రోడ్డున పడ్డారు. విశాఖలో మోదీ పేరు ఎత్తడానికే చంద్రబాబు భయపడ్డారు. కరోనా కష్టకాలంలో అండగా ఉండాల్సిన చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి దాక్కున్నారు. చంద్రబాబు మోసం, దగాను ప్రజలు చూశారు కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించారని’’ మంత్రి దుయ్యబట్టారు.

దమ్ముంటే మోదీని ప్రశ్నించు..
దేవుడి లాంటి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును కృష్ణా జిల్లాలో తిరగనీయకుండా ఇంటికొకరు రావాలన్నారు. పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగినందుకు దమ్ముంటే మోదీని బాబు ప్రశ్నించాలన్నారు. కుప్పంలో చిత్తుచిత్తుగా ఓడినా చంద్రబాబుకు సిగ్గు రాలేదని.. ఆయనను నమ్ముకుంటే కుక్క తోకను పట్టి గోదారి ఈది నట్లేనని ఎద్దేవా చేశారు.

టీడీపీకి మనుగడ లేదనే...
ఓటుకు రూ.5 కోట్లు ఇచ్చి దొరికిపోయిన దొంగ.. చంద్రబాబు అని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ఒక దుర్మార్గుడని సాక్షాత్తూ ఎన్టీఆరే వీడియో విడుదల చేశారని మంత్రి గుర్తు చేశారు. టీడీపీకి మనుగడ లేదని ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల నుంచి వచ్చిన నాయకుడని.. ఆయనకు, ప్రజలకు విడదీయలేని అనుబంధం ఉందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.


చదవండి:
బాబు రౌడీ రాజ్యాంగానికి అవన్నీ ఉదాహరణలే: పోసాని 
ప్రజలపై అక్కసు.. చంద్రబాబు శాపనార్థాలు  

మరిన్ని వార్తలు