మంత్రి కురసాల కన్నబాబు
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోరాటాలు ద్వారా ఉచిత విద్యుత్ సాధించామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. (చదవండి: ‘చంద్రబాబు ఏమైనా దేవదూతనా..’)
‘‘చంద్రబాబు ఎప్పుడు పోరాటం చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తామంటే హేళన చేశారు. దేశంలో ఉచిత విద్యుత్ తొలిసారిగా ఇచ్చింది వైఎస్సార్. ఉచిత విద్యుత్ గురించి చంద్రబాబు మాట్లాడటం బాధాకరం. బిల్లులు కట్టకపోతే రైతులను చంద్రబాబు జైలుకు పంపారు. బేడీలు వేసి రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కందారిలో కాల్పులు జరిగాయి. ఏలూరులో ఆయన పాలనలో రైతులపై లాఠీ చార్జీ జరిగింది. బషీర్బాగ్లో రైతులపై కాల్పుల జరిపించారని’’ కన్నబాబు గుర్తుచేశారు. వెన్నుపోటుకు పేటెంట్ చంద్రబాబు అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి చంద్రబాబులా కుట్రలు, కుతంత్రాలు తెలియవన్నారు. ఉచిత విద్యుత్ వలన రైతులపై రూపాయి భారం పడదని, నగదు బదిలీ వలన రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం స్పష్టంగా చెపుతున్న చంద్రబాబు తీరు మారలేదని ఆయన మండిపడ్డారు. (చదవండి: ‘చంద్రబాబు రాజకీయ నిరాశ్రయుడు’)
‘‘వేలాది మంది రైతులు చంద్రబాబు హయాంలో రోడ్ల మీదకు వచ్చారు. రైతులు మీద నాన్ బెయిల్ బుల్ కేసులు చంద్రబాబు పెట్టించారు. రైతులకు వైఎస్ జగన్ అన్యాయం చేయరు. వైఎస్ జగన్ని చంద్రబాబు వెన్నుపోటు దారుడు అంటున్నారని.. రైతు భరోసా ఇవ్వడం, సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వడం, ధరల స్థిరీకరణ కోసం 3 వేల కోట్లు కేటాయించడం వెన్నుపోటునా..?’’ అని కన్నబాబు ప్రశ్నించారు.
చంద్రబాబు పెట్టిన ధాన్యం బకాయిలు రూ.910 కోట్లను సీఎం జగన్ చెల్లించారని, రైతులు బలవర్మణం పొందితే 7 లక్షలు ఇవ్వాలని ఆయన ఆదేశించారని తెలిపారు. రైతులకు చేసిన మేలుపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని కన్నబాబు సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే తమ సవాల్ స్వీకరించాలన్నారు. జమిలి ఎన్నికలు వస్తాయని తండ్రి, కొడుకులు పగటి కలలు కంటున్నారని, నాయకులను కాపాడుకొనేందుకు రెండేళ్లలో జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు.