అత్యంత శాస్త్రోక్తంగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు..

24 Feb, 2022 07:52 IST|Sakshi

గణపతి, అగ్నిప్రతిష్టాపన హోమాలు 

గౌతమ్‌రెడ్డి చెవిలో నారాయణ మంత్రం జపించిన తనయుడు కృష్ణార్జునరెడ్డి, కుటుంబ సభ్యులు 

రాహుకాలం ముందే చితికి నిప్పు 

ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారం 

తండ్రి భౌతికకాయం వద్ద గుండెలవిసేలా రోదించిన తనయుడు 

మౌనంగా విలపించిన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి

సాక్షి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దహన సంస్కారాలు ఉదయగిరి మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం వేదపండితుల సమక్షంలో అత్యంత శాస్త్రోక్తంగా ఆయన కుటుంబ సభ్యులు జరిపించారు. ముందుగా గౌతమ్‌రెడ్డి తనయుడు కృష్ణార్జునరెడ్డి చేత పండితులు గణపతి హోమంతో పాటు అగ్నిప్రతిష్టంభన హోమం చేయించారు. గౌతమ్‌రెడ్డి చెవిలో కుటుంబ సభ్యులతో నారాయణ మంత్రం జపించారు. దహన సంస్కారాలు కూడా రాహుకాలం రాక ముందే సంప్రదాయ రీతిలో నిర్వహించారు. వేలాది మంది మేకపాటి అభిమానులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతుల సమక్షంలో వేదపండితులు మధ్యాహ్నం 12 గంటలలోపే కృష్ణార్జునరెడ్డి చేత చితికి నిప్పంటించారు. గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని గంధపు చెక్కలతో దహనం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. చితికి నిప్పంటించినన ఆనంతరం పోలీసులు మూడు సార్లు గాల్లోకి కాల్పులు జరిపి వీడ్కోలు పలికారు. 

గౌతమ్‌రెడ్డి పాడె మోస్తున్న మంత్రి అనిల్‌

గుండెలలిసేలా.. 
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం వద్ద ఆయన తనయుడు కృష్ణార్జునరెడ్డి గుండెలవిసేలా రోదించాడు. ఆయన విదేశాల్లో విద్యభ్యాసం చేస్తున్న సమయంలో తన తండ్రి మరణవార్త విని హటాహుటినా బయలు దేరిన మంగళవారం రాత్రి 11 గంటలపైన నెల్లూరులోని స్వగృహనానికి చేరుకున్నారు. అప్పటి వరకు మంత్రి మేకపాటి పార్థివదేహన్ని ప్రజల దర్శనార్థం బయట ఉంచిన కుటుంబ సభ్యులు ఆయన తనయుడు రాక ముందే మంత్రి అధికార కార్యాలయ గదిలోకి మార్చారు. ఇంటికి చేరుకున్న కృష్ణార్జునరెడ్డి తండ్రి భౌతికకాయాన్ని చూసి రోదించాడు. అక్కడున్న అందరిని కాసేపు బయటకు వెళ్లమని చెప్పి తానొక్కడే తండ్రి దేహం వద్ద కూర్చొని చాతి నిరుముతూ బోరున విలపించాడు. తనయుడు బాధను చూసి వారి కుటుంబ సభ్యులు దుఃఖంతో గుండెలవిసేలా విలపించారు. 

చదవండి: (తండ్రి భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన కృష్ణార్జునరెడ్డి)


తండ్రి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న తనయుడు కృష్ణార్జున్‌రెడ్డి 

మౌనంగానే ఉంటూ.. 
తన ముద్దుబిడ్డ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తట్టుకోలేకపోయాడు. ఇకపై తమబిడ్డ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎందరో మేకపాటి ఆప్తులు, ప్రముఖులు, అభిమానులు వేలాది మంది తరలివచ్చి ఆయన్ను ఓదార్చుతున్న వారందరితో మౌనంగానే చేయేత్తి నమస్కరిస్తూ బరువెక్కిన హృదయంతో లోలోపల కుమిలిపోయాడు. తన బిడ్డ పార్థివదేహన్ని తదేకంగా చూస్తూ మౌనంగానే రోదించారు. గౌతమ్‌రెడ్డికి తండ్రి రాజమోహన్‌రెడ్డి అంటే ఎనలేని ప్రేమ. ప్రతి రోజు ఎక్కడున్నా రోజుకు పదిసార్లయినా తండ్రికి ఫోన్‌ చేసి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు ఆ రోజు తాను చేసిన పనులను చెప్పేవాడు. ఇటీవల దుబాయ్‌ వెళ్లి రూ.5 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఎంఈఓలు కుదిరాయని తండ్రికి ఫోన్‌లో చెప్పడంతో కుమారుడిని అభినందించారు. అంతలోనే పుత్రశోకం మిగలడంతో మేకపాటి రాజమోహన్‌రెడ్డి తట్టుకోలేక మౌనంగా రోదిస్తున్నారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు