ఇకపై ఉద్యోగ వివరాలకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్..

24 Jul, 2020 16:50 IST|Sakshi

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన ఐటీ శాఖపై సమీక్ష

సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో 'ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ' శాఖ పాత్ర మరింత కీలకం కానుందని పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రోజున మంత్రి మేకపాటి అధ్యక్షతన ఐటీ శాఖపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఇండస్ట్రియల్ పాలసీతో పాటుగా, ఐటీ పాలసీనీ ప్రకటించేలా సమాయత్తమవ్వాలి. సైబర్‌ సెక్యూరిటీకి టాప్‌ ప్రయారిటీ ఇవ్వాలి. ఐటీలో భారీ పెట్టుబడుల ఆకర్షణపైనే దృష్టి పెట్టాలి. చౌకగా సంస్థలను ఏర్పాటు చేయడంలో ఏపీ అత్యంత అనుకూలం. ఐటీకి గమ్యస్థానంగా నిలిచే అన్ని వనరులు గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. (ఆ ఒప్పందంతో కీలక మలుపు..)

ఐటీ పాలసీపై తుది కసరత్తు పూర్తిచేయడంలో వేగం పెంచాలి. పరిపాలన విభాగం కిందకి ఈ -ప్రగతి, రియల్ టైమ్ గవర్నెన్స్, తద్వారా వేగంగా మరిన్ని సేవలందించే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. నైపుణ్యంలో భాగంగా హై-ఎండ్ స్కిల్ యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (ఐఐడీటీ), ఐటీ ప్రమోషన్స్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (ఏపీఈఐటీఏ), ఆంధ్రప్రదేశ్ ఇన్నొవేషన్ సొసైటీ (ఏపీఐఎస్‌) అన్ని రంగాల ఉద్యోగావకాశాలకు సంబంధించిన డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌‌ఛేంజ్‌పై చర్చించారు. (చౌక‌గా ఇంట‌ర్నెట్ అందించ‌డ‌మే ల‌క్ష్యం)

ఉపాధి వివరాలకు ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌
విద్య, అర్హతలు, అవకాశాలను బట్టి నేరుగా ఉపాధి వివరాలు తెలుసుకునే విధంగా ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రొక్యూర్‌మెంట్, ఇన్‌ఫ్రా & కమ్యునికేషన్స్ కింద ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సెర్వీసెస్ (ఏపీటీఎస్‌) 'మీ-సేవ' టెక్నికల్‌గా గ్రామసచివాలయాల (పంచాయతీరాజ్ శాఖ) పరిధిలోకి తీసుకువెళ్లడంపైనా చర్చించారు. దీనిపై జీవో ఇచ్చినా ఇంకా సాంకేతిక కారణాల దృష్ట్యా ఐటీ పరిధిలోనే ఉందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సుందర్ మంత్రికి వివరించారు. జీఏడీ దృష్టికి తీసుకువెళ్లి ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి మేకపాటి అధికారులకు సూచించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ(ఏపీఐటీఏ), ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఏపీఎస్‌ఏసీ), సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్స్ (ఎస్‌ఏపీనెట్‌)లను ఒక తాటిపైకి తీసుకురావడంపైనా కార్యదర్శి భాను ప్రకాశ్, సలహాదారులతో మంత్రి చర్చించారు. (ఫ్యాబ్రిక్‌ హబ్‌గా ఏపీ)

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ఎటువంటి సమస్యలు ఉండకూడదు
కరోనా ఉధృతి నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్'కు అనుగుణంగా అన్ని విధాల సన్నద్ధానికి మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ఐటీ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్'లో ఎటువంటి సమస్య రాకుండా చూడాలి. ఇంటర్నెట్ కనెక్టిటవిటీ సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ బడ్జెట్, వినియోగంపై తదితర శాఖాపరమైన ఆర్థిక అంశాలపై మంత్రి ఆరా తీశారు. కోవిడ్-19 నేపథ్యంలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు, టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు.

 ఐటీ శాఖలో ఐఎస్‌బీ భాగస్వామ్యంపై శిక్షణ, సంస్థాగత నిర్మాణాలపై అధ్యయనం, ఆర్థిక సర్దుబాటు, పెట్టుబడుల ఆకర్షణ అంశాలలో ఐఎస్‌బీ సౌజన్యం, వినియోగించుకునే పద్ధతిపైనా చర్చించారు. ఐటీ శాఖపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షకు హాజరైన వారిలో ఐటీ శాఖ కార్యదర్శి యేటూరు భాను ప్రకాశ్, ప్రత్యేక కార్యదర్శి బి సుందర్, ఐటీ సలహాదారులు లోకేశ్వర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి (టెక్నికల్), దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి (టెక్నికల్), ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు. (టెక్స్​టైల్​ హబ్​గా ఆంధ్రప్రదేశ్)

మరిన్ని వార్తలు