ఆక్సిజన్ విషయంలో రాష్ట్రానికే తొలి ప్రాధాన్యత

22 Apr, 2021 13:36 IST|Sakshi

రాష్ట్ర అవసరాల తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని పర్రిశమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆక్సిజన్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కే తొలి ప్రాధాన్యత అని, రాష్ట్ర అవసరాల తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామని తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ ఆక్సిజన్‌ సరఫరాపై క్షేత్రస్థాయి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో 40 రకాల పరిశ్రమల ద్వారా 510 ఎంటీ మెడికల్ ఆక్సిజన్ తయారీ చేస్తున్నామన్నారు. రోజూ 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి లక్ష్యమని పేర్కొన్నారు. ఆక్సిజన్‌ సరఫరాపై గురువారం ఆయన సమీక్ష జరిపారు.

ఈ సమీక్షలో మంత్రి హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్,  పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, వైద్య శాఖ, ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన నోడల్ అధికారి, 13 జిల్లాల పరిశ్రమల శాఖ అధికారులు, ఆర్ఐఎన్ఎల్, ఎల్లెన్ బెర్రీ తదితర పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమల వివరాలను మంత్రి మేకపాటికి  పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రహ్మణ్యం వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి, ఆక్సిజన్ అవసరాలు, మొదటి వేవ్‌లో వినియోగించిన ఆక్సిజన్ సామర్థ్యాలపై  పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ ప్రజంటేషన్ ఇచ్చారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఆక్సిజన్ వినియోగం, ఉత్పత్తి, అవసరాలపైనా మంత్రి  చర్చించారు.


చదవండి:
అవినీతి గని.. నాటి సీఎం రిలీఫ్‌ నిధి
అపురూప దృశ్యం.. ఆవిష్కృతం 

మరిన్ని వార్తలు