సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారీ పెట్టుబడులు పెట్టేలా అదానీ గ్రీన్ ఎనర్జీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చరిత్రాత్మకమని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో గతంలో ఎన్నడూ జరగని విధంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్ర విద్యుత్ రంగంలోనే కీలకమైన పరిణామమని అన్నారు.
చదవండి: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చిందని, 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. తద్వారా రైతులకు శాశ్వతంగా నాణ్యమైన ఉచిత విద్యుత్ను భవిష్యత్లో కూడా అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో బాటలు వేశారన్నారు.