మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని గ్రామ స్వరాజ్యం దిశగా నడిపిస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ సర్పంచ్లకు పరిపాలనను సులభతరం చేశారన్నారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో సర్పంచ్ల శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి పెద్దిరెడ్డి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులుగా ఎదిగేందుకు గ్రామ సర్పంచ్ పదవి తొలిమెట్టు అని, సమర్థ నాయకత్వంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపాలని తెలిపారు. అందుకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం అందిస్తోందని గుర్తుచేశారు. సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసే బాధ్యత సర్పంచులదే అని పేర్కొన్నారు. గ్రామ పరిపాలనలో సర్పంచ్ల పనితీరే కీలకమని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరచాలని పెద్దిరెడ్డి తెలిపారు.