చంద్రబాబుకు చేతనైంది మోసమే..

7 Mar, 2021 15:22 IST|Sakshi

మంత్రి పేర్ని నాని

సాక్షి, తాడేపల్లి: ఓడించారన్న కోపంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు... ప్రజలపై అక్కసు తీర్చుకుంటున్నారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పదవి పోయిన తర్వాత చంద్రబాబుకు పిచ్చి పట్టిందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు దోచుకున్న డబ్బులను హెరిటేజ్‌లో పెట్టారని.. హెరిటేజ్‌ అంతా పాపాలపుట్ట అని విమర్శించారు. ఏ వ్యాపారం చేసి వందల కోట్లను చంద్రబాబు సంపాదించారని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉండి పాపాలు చేసి ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారని.. అమరావతి పేరుతో గుంటూరు, విజయవాడను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. భూములు దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ.. ప్రజలపై చంద్రబాబుకు మమకారం, ప్రేమ లేదన్నారు. మాయమాటలతో ఆయన ప్రజలను మభ్యపెట్టారని.. అందుకే 2019లో చంద్రబాబును వదిలేశారని విమర్శలు గుప్పించారు.

‘‘దుర్గమ్మవారి జోలికి వెళ్లినందుకే.. చంద్రబాబుకు మనశ్శాంతి లేకుండా పోయింది. కుట్రలు, క్షుద్ర రాజకీయాలు మానుకోవాలి. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని’’ పేర్ని నాని హితవు పలికారు. చంద్రబాబు సీఎంగా ఉండి కనీసం ఒక వంతెన నిర్మించలేదని.. ఆయన హయాంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేక పోయారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఏదో చేస్తానంటూ ప్రజలకు చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని.. చంద్రబాబుకు చేతనైంది ఒక్క మోసం చేయడమేనని’’ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు.
చదవండి
‘బాబు దుర్మార్గం.. టీడీపీ నేతలే నిజాలు కక్కారు’
నిరాశ, నిస్పృహలతోనే బాలకృష్ణ దాడి..

మరిన్ని వార్తలు