ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. గృహ రుణాలకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ సౌకర్యం

16 Sep, 2021 16:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వాల హయాంలో ఏపీ హౌజింగ్‌ కార్పొరేషన్‌ వద్ద నుంచి లోన్లు తీసుకున్న పేద వర్గాలకు ఊరట కలిగించేందుకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ సౌకర్యం తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

పేదల గృహ రుణాలపై వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిందని పేర్ని నాని తెలిపారు. 1983 నుంచి 2011 ఆగష్టు 15 మధ్య వివిధ ప్రభుత్వాల ద్వారా పొందిన ఇంటి స్థలాలపై లోన్లు తెచ్చుకునే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని వారి సొంత ఆస్తిగా మార్చి ఇచ్చేందుకు తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు.

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా 46,61,737 మంది లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేల వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ సౌకర్యం పొందవచ్చన్నారు. మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల పరిధిలోని వారయితే రూ.20 వేలు చెల్లించి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకోవచ్చని తెలిపారు. 
చదవండి: ఏపీ కేబినెట్‌: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

మరిన్ని వార్తలు