ఎన్టీఆర్‌ను అమిత్‌ షా కలవగానే చంద్రబాబుకు వణుకు మొదలైంది: మంత్రి రోజా

26 Aug, 2022 13:41 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిచ్చి ఆసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోతోందని.. అందుకే చంద్రబాబు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాగా, మంత్రి ఆర్కే రోజా.. రాజమండ్రిలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నాయుడు పిచ్చి ఆసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయి. మొన్నటి వరకు ఓ ఫేక్‌ వీడియోతో చంద్రబాబు నాటకాలు ఆడారు. నిన్న కుప్పంలో మరో నాటకానికి తెరలేపారు. సీఎం ఏం చేసినా రాద్దాంతం చేయాలని బాబు చూస్తున్నారు. చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మడం లేదు. 

కుప్పంలో తన కోట కూలిపోతోందని బాబు భయపడుతున్నాడు. అందుకే తన కార్యకర్తలను రెచ్చగొడుతూ ఓ అమ్మాయి అని కూడా చూడకుండా ఎంపీపీ మీద దాడి చేశారు. ఎప్పుడైతే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసి మాట్లాడారో.. అప్పటి నుంచి చంద్రబాబులో వణుకు మొదలైంది. రాజకీయంగా కాదు.. అన్ని రకాలుగా చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని బాబు.. ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నార’ని విమర్శించారు. 

ఇది కూడా చదవండి: అందుకే సీఎం జగన్‌ జననేత అయ్యారు..!

మరిన్ని వార్తలు