'దేవుడిని అడుపెట్టుకుని రాజకీయం సరికాదు'

8 Jan, 2021 14:21 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: లక్ష మంది పనిచేస్తున్న మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖకు మంత్రిగా పనిచేసే అవకాశం ఇవ్వడం నా అదృష్టమని మంత్రి తానేటి వనిత అన్నారు. మహిళా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలుపై పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర స్దాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి వనిత, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనురాధ, డైరెక్టర్‌ కృతికా శుక్లా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్‌ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళల పథకాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లినపుడు వెంటనే స్పందిస్తారు. 12 సంవత్సరాలుగా ఈ శాఖలో ప్రమోషన్లు రాలేదు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ శాఖకు నిధులు కూడా కొరతే. సంవత్సరానికి రూ.500 కోట్లు కేటాయిస్తే, నేడు జగనన్న ప్రభుత్వం రూ.1,800 కోట్లు కేటాయించింది. చదవండి: ('బీజేపీ జై శ్రీరాం‌ కాకుండా చేసిన అభివృద్ధి చెప్పాలి')

గర్భవతులకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణతో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా మహిళల అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తున్నారు. మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చేయూత కార్యక్రమం ప్రారంభించారు. మహిళలు రాజకీయంగా ముందుండేందుకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అండగా ఉండేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు' అని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

ఉనికిని చాటుకునేందుకే.. 
ఇప్పటివరకు రాజధాని, కులాల అంశాలు తెరపైకి తెచ్చినా స్పందన లేకపోవడంతో  కొత్తగా దేవుడిని ముందుకు తెచ్చారు.  ప్రతిపక్షం తమ ఉనికిని చాటుకునేందుకే ఈ అంశాల్ని తెర మీదకు తెచ్చింది. అందులో భాగంగానే.. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సమయంలో విజయవాడలో దేవాలయాల కూల్చివేతపై బీజేపీ ఎందుకు మాట్లడలేదు.

దుర్గ గుడి అభివృద్ధికి సీఎం జగన్‌ రూ.70 కోట్లు విడుదల చేశారు. టీడీపీ కూల్చి వేసిన గుడులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పునర్నిర్మించేందుకు ఈరోజు శంకుస్థాపన చేశారు. టీడీపీ దేవుడుని అడుపెట్టుకుని నీచమైన రాజకీయాలు చేయడం సరికాదు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. అధికార పార్టీ చేసే పనులపై తప్పొప్పులు మాట్లాడాలి కానీ దేవుడిని అడుపెట్టుకుని రాజకీయం చేయడం సరికాదు' అని మంత్రి తానేటి వనిత అన్నారు.   చదవండి: (ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్‌ భూమిపూజ)

మరిన్ని వార్తలు