ఆలయాలపై దాడులు: ఏపీ ప్రభుత్వం సీరియస్‌

4 Jan, 2021 20:36 IST|Sakshi

దేవాదాయ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెల్లంపల్లి భేటీ

సాక్షి, విజయవాడ: రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో దేవాదాయ, పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజా శంకర్, దేవాదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్లు, ఆర్ జేసీలు, డీసీలు హాజరయ్యారు. రామతీర్థం ఘటన తో పాటు దేవాలయాలపై జరుగుతున్న దాడులపై అధికారుల నుంచి వివరాలను అడిగి మంత్రి తెలుసుకున్నారు. (చదవండి: కూల్చే సంస్కృతి టీడీపీదే: జయరామ్‌)

ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. రామతీర్థం రాముడు విగ్రహం పున:ప్రతిష్ఠపై చర్చించారు. అధికారులు, పండితుల అభిప్రాయాలను మంత్రి తీసుకున్నారు. నెల రోజుల్లో రాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని  దేవాదాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.(చదవండి: విగ్రహాల ధ్వంసం: దీని వెనక ఉన్నది టీడీపీనే)

చిన్న చిన్న దేవాలయాల్లోనూ కూడా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఆలయాల్లో సీసీ కెమెరాలు, మెటల్ డోర్ డిటెక్టర్స్ తో తనిఖీలు, ఎస్పీఎఫ్‌ సిబ్బంది బందోబస్తు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన దేవాలయాలపై దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందని మంత్రి వెల్లంపల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. రామతీర్ధం ఆలయంలో జరిగిన ఘటన దురదృష్డకరమని, దీని వెనుక కుట్రకోణాలు కనిపిస్తున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

 తిరుపతి ఉప ఎన్నికలో లబ్ధి కోసమే బాబు కుట్రలు..
సమీక్ష అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. రామతీర్ధం ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌... ఇప్పటికే సీఐడీ విచారణకి ఆదేశించారని, రామతీర్థం ఆలయాన్ని పూర్తిగా ఆధునీకరించాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. ‘‘అధికారులు రూపొందించిన డిజైన్‌ని ఆమోదించాం. ఆగమ పండితులతో చర్చించాం. విగ్రహాన్ని ఎప్పుడు పునఃప్రతిష్ట చేయాలో మరోసారి ఆగమ పండితులతో చర్చించి రెండు రోజులలో ప్రకటిస్తాం.రామతీర్థం దోషులనను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ ర్యాలీ విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

రామతీర్థం చాలా చిన్న ప్రాంతం. ఎక్కువ మంది వెళ్తే ఇబ్బందికరం. రాజకీయంగా బురద చల్లాలని చూడటం దారుణం. విజయవాడలో ఓ ఆలయంలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతోంది. రాజమండ్రి ఘటనపై కూడా సీఐడీ విచారణకి ఆదేశించాం. టీడీపీ వర్గానికి చెందిన ఆలయాల్లోనే దాడులు జరుగుతున్నాయి. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న ఆలయాల్లో సీసీ కెమెరాలు పెట్టలేదు. రాష్ట్రంలో ఆలయాలపై దాడుల కేసులో 169 మందిని అరెస్ట్ చేశాం.

రాష్ట్రంలో 57,584 ఆలయాలు ఉన్నట్టు పోలీస్‌శాఖ మ్యాపింగ్ చేసింది. అంతర్వేది ఘటనకు ముందు 3వేల ఆలయాల్లోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 39,076 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. దేవాలయాల నిధులను ఎక్కడా డైవర్ట్ చేయలేదు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందలు, వేలల్లో దాడులు జరిగాయని ‌తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బాబు హయాంలో ధ్వంసం చేసిన ఆలయాలను పునర్నిర్మిస్తాం. తిరుపతి ఉపఎన్నికలో లబ్ధి కోసం బాబు కుట్రలు చేస్తున్నారని’’ మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు