పేదలకు అండగా నిలిచిన బడ్జెట్‌ ఇది‌: మంత్రి వేణుగోపాల కృష్ణ

11 Mar, 2022 18:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: పేదవాడికి అండగా నిలిచిన బడ్జెట్‌ ఇదని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. విద్య కోసం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్‌ అన్నారు. బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు కూడా మేలు చేసే బడ్జెట్‌ అని పేర్కొన్నారు. బీసీ వర్గాలకు రూ.29 వేల కోట్లకుపైగా బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయని తెలిపారు. బీసీ వర్గాలకు గొప్ప మేలు చేసే బడ్జెట్‌ ఇదని చెప్పారు.

చదవండి: ఏపీ బడ్జెట్‌ 2022-23 ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన

నవరత్నాలతో పాటు అన్ని రంగాలకు ప్రాధాన్యత: శ్రీకాంత్‌రెడ్డి
ఆర్థిక రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు సర్కార్‌ చేసిన అప్పులకు మేం వడ్డీ కడుతున్నామన్నారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాల్లో ఎక్కడా కేటాయింపులు తగ్గలేదన్నారు. నవరత్నాలతో పాటు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చామని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని సైతం అడ్డుకునేందుకు యత్నించిన దుర్మార్గపు ప్రతిపక్షం టీడీపీ అని దుయ్యబట్టారు. ప్రజలకు మంచి బడ్జెట్‌ ఇచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు  శ్రీకాంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

డ్రోన్ల వినియోగం.. దేశంలోనే వినూత్న ప్రయత్నం: ఎంపీ విజయసాయిరెడ్డి
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రవేశపెడుతూ సీఎం జగన్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిందని.. 10 వేల డ్రోన్లు వాడుకలోకి వస్తాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. పెస్టిసైడ్లు, ఎరువులు, విత్తనాలు డ్రోన్లతో చల్లడం వల్ల సేద్యం ఖర్చు తగ్గుతుందన్నారు. 20 వేల మంది డ్రోన్‌ పైలట్లుగా ఉపాధి పొందుతారన్నారు. దేశంలోనే వినూత్న ప్రయత్నం అని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సబ్‌ప్లాన్‌లకు భారీగా కేటాయింపులు: సామినేని 
బడ్జెట్‌లో వాస్తవ కేటాయింపులు, ఖర్చులు ఉంటాయని.. వివిధ సబ్‌ ప్లాన్‌లకు భారీగా కేటాయింపులు చేశారని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. చంద్రబాబు వ్యవసాయ బీమా బకాయిలు కూడా తమ ప్రభుత్వం చెల్లించిదన్నారు.

మరిన్ని వార్తలు