పేదవర్గాలకు భరోసాను కల్పించే అద్భుతమైన బడ్జెట్‌ ఇది

16 Mar, 2023 18:57 IST|Sakshi

బలహీన వర్గాలకు 80వేల కోట్ల రూ.లు బడ్జెట్ కేటాయింపు సంతోషదాయకం

ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగం వినకుండానే ప్రతిపక్ష సభ్యులు వెళ్ళిపోవడం దారుణం

బీసీలకు 38వేల 600 కోట్ల రూ.లు కేటాయించినందుకు బీసీల తరపున ధన్యవాదాలు

మంత్రి సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో గురువారం రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ 2023-24 సంవత్సరానికి 2 లక్షల 79వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద వర్గాలకు భరోసాను కల్పించే బడ్జెట్‌గా రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, బీసీ సంక్షేమం,, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి సిహెచ్. శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.

గురువారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదరికంపై పోరాటం చేసే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పేదల సంక్షేమానికి మంచి బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. ఈ బడ్జెట్ ప్రసంగాన్ని వినకుండానే బడ్జెట్‌ను చూడకుండానే ప్రతిపక్ష సభ్యులు సభలో గొడవ చేసి సభ నుండి సస్పెండ్ చేయించుకుని వళ్ళిపోడవం చాలా దురదృష్టకరమని దీనిని ప్రజలు గమనించాలని సూచించారు.బడ్జెట్ ప్రసంగం అయ్యాక బాధ్యత గల ప్రతిపక్షంగా వారి అభిప్రాయాలను తెలియ జేయవచ్చు గాని ఆవిధంగా చేయకుండా ముందుగానే సభ నుండి వెళ్ళిపోయారని చెప్పారు. 

ప్రస్తుత బడ్జెట్లో 2లక్షల 79 వేల కోట్ల రూ.లు బడ్జెట్లో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని ఏకంగా 80 వేల కోట్ల రూ.లు కేటాయించడం అభినందనీయమని మంత్రి వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. అదే విధంగా వ్యవసాయ రంగానికి కూడా అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి 43వేల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. బడ్జెట్‌లో అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యతను కల్పించడం జరిగిందని తెలిపారు.

అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలులో ముఖ్యంగా సంక్షేమ పధకాలు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకే అందేలా ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి)విధానం ద్వారా అర్హులైన పేదలందరికీ అందేలా చేయడం జరుగుతోందన్నారు.పేదరిక నిర్మూలకు ధనం,విద్య అత్యంత ప్రధానం అని భావించి ఆదిశగా పేదరిక నిర్మూలనకు సీఎం జగన్‌ అన్ని విధాలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు, మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి తగిన రీతిలో నిధులు కేటాయిండం అభినందనీయమని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు బీసీలు, బడుగు బలహీన వర్గాల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు